
( నడిచొచ్చే కొండ… ఈ కుడుపూడే అండ)
నాకు మన ఎస్కేబీఆర్ కళాశాలే అన్నీ నేర్పింది. నేను అటు ఆటల్లోనూ, ఇటు నాయకుడిగాను ఎదగడానికి, నేటి నా అభ్యున్నతికి మన కాలేజే కారణం” అన్నారు ప్రస్తుత ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ నాతో. “ఇలా కాలేజీలో మీ అనుభవాల గురించి రాయాలండి. నాకు కొంత సమాచారం కావాలండి” అని అడిగితే ఆయన చెప్పిన మొదటి సమాధానం ఇది.
ఇలా చెబుతున్నప్పుడు.. అసలే బాడీ బిల్డరేమో ఆ ఛాతీ కాస్త ఉప్పొంగడం చూసాను. దాంతో పాటు కనురెప్పలు బలవంతంగా అడ్డుకుంటున్న ఓ రెండు కన్నీటి బొట్లు కూడా కనిపించాయి. పెద్ద వారు కదా… పైగా ఎమ్మెల్సీ కూడా… బలవంతంగా ఆ ధారని ఆపుకున్నట్లుగా నాకు అనిపించింది. ఈ మాటలు అన్న వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మరోమాట… “ఆయన వల్లే నేను కాలేజీలో ఉండగా స్పోర్ట్స్లో ఇన్ని కప్పులు తీసుకురాగలిగాను”. “ఎవరండి ఆయన?” అనే నా ప్రశ్న పూర్తి కాకుండానే “పోడూరి కృష్ణమూర్తిగారు… మహానుభావుడు. నేను కప్పులు కొట్టుకొస్తే ఆయన సొంత కొడుకే గెలిచినట్లుగా సంబర పడిపోయే వారు. ఈ కాలేజీ, ఆ పోడూరి కృష్ణమూర్తి గారు లేకపోతే నేను ఏదైనా అవుదునేమో కానీ ఇలా మాత్రం కాకపోదును” అని కుడుపూడి సూర్యనారాయణ గారే మళ్లీ అన్నారు.
అమలాపురంలోనే ప్రాథమిక విద్య చదివిన ఈయన పీయూసీ, డిగ్రీ కూడా ఎస్కేబీఆర్ కళాశాలలోనే చదివారు. ఇక్కడ చదువుతున్నంత సేపు చదువు కంటే ఆటల మీదే ఆయన దృష్టి. అన్నట్లు ఎక్కడికైనా వెళ్లి కప్పు కొట్టుకొస్తే అప్పటి ప్రిన్సిపాల్ రమేశం గారు “మన వాడు కప్పు తెచ్చాడు. కాలేజీకి సెలవు ప్రకటించండి” అనే వారని కూడా సూర్యనారాయణ గారు చెబితేనే నాకు తెలిసింది. డిగ్రీ పూర్తి చేశాక విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీలో పదిహేను సంవత్సరాలు చదివారు ఆయన. ఎంఏ హిస్టరీ, ఫిలాసఫీతో పాటు లా కూడా అక్కడే చదివారు. పదిహేను సంవత్సరాల పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే చదువుకున్న ఆయన ఆ సమయంలో అమలాపురం కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ ఓ పెద్దన్న. యూనివర్శిటీలో సీటు తెచ్చుకున్న విద్యార్థులకు హాస్టల్ వసతితో పాటు ఇతర విషయాలన్నీ దగ్గరుండి చూసుకునే వారు. కాలేజీ రోజుల నుంచే విద్యార్థి నాయకుడిగా ఎదిగిన నూర్యనారాయణ గారు ఆ వారసత్వాన్ని యూనివర్శిటీ వరకూ తీసుకెళ్లారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ కె.హరిబాబు వంటి ఆనాటి విద్యార్థులకు ఇతర విద్యార్థుల నుంచి సమస్యలు వస్తే ఈయనే ముందుండి ‘యుద్ధం’ చేసే వారు. సమైక్య రాష్ట్రానికి ఆనాడు డీజీపీగా పని చేసిన కుడుపూడి గోపాలకృష్ణ గోఖలే గారు వీరి తండ్రి, తల్లి మహాలక్ష్మి.
బాస్కెట్ బాల్, ఫుట్బాల్ వంటి ఆటల్లో రాణించడమే కాదు బాడీ బిల్డర్గా కూడా వీరికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ పోటీల్లో కూడా అనేక టోర్నమెంట్లలో గెలిచి ఎస్కేబీఆర్ కళాశాలకే పేరు తీసుకువచ్చారు. “ఈ వయసులో కూడా నేను రోగాలకు, మందులకు దూరంగా ఉన్నానంటే కారణం నా బాడీ బిల్డింగ్, నేను ఆడిన ఆటలే” అంటూ ఓ నవ్వు నవ్వారు. ఈ నవ్వు వెనుక అర్థం ఇప్పుడు అందరూ ఆటలు చూస్తున్నారే తప్ప ఆడడం లేదని నాకనిపించింది. దేశానికి స్పీకర్ గా చేసిన బాలయోగి, కేంద్రమంత్రిగా చేసిన ఎర్రంనాయుడు, రాష్ట్ర మంత్రులుగా, స్పీకర్లుగా పని చేసిన కిమిడి కళా వెంకట్రావ్, తమ్మినేని సీతారాం, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా కుడుపూడి సూర్యనారాయణకు యూనివర్శిటీలో సహాధ్యాయులే.
అన్నట్లు సుప్రీంకోర్టు మాజీ ఛీప్ జస్టిస్ చలమేశ్వర రావు గారు కూడా సూర్యనారాయణ గారికి మంచి స్నేహితుడు. ఆ స్నేహమే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సహకరించింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టీ.రామారావు దగ్గరకు ఈయన్నితీసుకువెళ్లింది జస్టిస్ చలమేశ్వరరావు గారే. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని అవకావం ఇస్తే “ఆయ్… మాది అమలాపురవండి. అక్కడి నుంచే పోటీ చేస్తానండి. ఇస్తే అక్కడి నుంచి ఇవ్వండి అవకాశం, ఆయ్” అన్నారట ఎన్టీఆర్తో. “అక్కడ మీ బాబాయ్ కుడుపూడి ప్రభాకర రావు గారు కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు కదా…!” అని ఎన్టీఆర్ అడిగితే, “ఆయన మీదే పోటీ చేస్తానండి” అన్నానని సూర్యనారాయణ గారు చెప్పారు. ఆ సీటు ఇవ్వలేదనుకోండి, అది వేరే విషయం. అలా రాజకీయ ప్రవేశం చేసిన కుడుపూడి సూర్యనారాయణ గారు ప్రస్తుతం వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆటల్లో ముందున్న ఈయన చదువులో మాత్రం వెనుక బెంచీనట. “నేనెప్పుడు మార్చిలో పరీక్షలు రాసి పాస్ కాలేదు. అన్నీ సెప్టెంబర్లో రాసి పాస్ అయినవే” అన్నారు. దీని వెనుక ఉన్న కారణమేంటంటే మార్చిలో ఇచ్చిన ప్రశ్నలు సెప్టెంబర్లో ఇవ్వరని, ఆ ప్రశ్నలకి జవాబులు చదివి పాస్ కావచ్చుననే లాజిక్ వీరిది. అన్నిసార్లు అలా జరుగుతుందా అంటే జరగకపోవచ్చు. కానీ, ఈయన విషయంలో మాత్రం జరిగింది.
క్రీడల కోటాలో చాలాచోట్ల ఉద్యోగాల అవకాశం వచ్చింది సూర్యనారాయణ గారికి. “అబ్బే! నేను ఒకరి దగ్గర చేయడవేంటి” అని న్యాయవాది వృత్తిలో స్థిరపడ్డారు. ఇలా న్యాయవాది అయినా ప్రతీ కేసు ఒప్పేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఉద్దేశ్యం లేదు. అందుకే క్రిమినల్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ మహిళలపై జరిగిన అకృత్యాలపై కోర్టులో వాదించే వారు. అన్నట్లు పైసా తీసుకోకుండా. ఈ లాయర్ వృత్తిలో ఆయనకు మిగిలిన సంతృప్తి మహిళల తరపున వాదించే లాయర్ అనే పేరు.
తన జీవితంలో ఇంత ఎదగడానికి, అభివృద్ధిలోకి రావడానికి కారణం తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛే అన్నారాయన. బంధువులమ్మాయే డాక్టర్ విజయగారిని పెద్దలు కుదిర్చేలోపు ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ విజయ గారు ప్రభుత్వ వైద్యురాలిగా అమలాపురంలో పని చేశారు. కుడుపూడి సూర్యనారాయణ గారి విశిష్టత ఒకటుంది. అదేంటంటే… 1950 సంవత్సరంలో మూడు వేల రూపాయలకు కొన్న బుల్లెట్ బండినే ఇప్పటికీ వాడతారు. రేబాన్ కళ్లజోడుతో.. డుడుడుడుడు అంటూ సౌండ్ చేస్తూ ఎవరైనా వస్తున్నారంటే అది కుడుపూడి సూర్యనారాయణ గారే. ఇప్పుడు ఎమ్మెల్సీ కదా… అలా తిరగ్గూడదు కదా… అంటే గన్మెన్లు, కార్యకర్తలు గట్రా ఉంటారు కదా… అందుకని ఓ ఐదారుగురు పట్టే పెద్ద కారులో తిరుగుతున్నారు. తెలతెల వారుతూండగా అమలాపురంలోని బాలుర ప్రాథమిక పాఠశాలకు వెళ్లండి. అక్కడ గ్రౌండ్లో ఓ మూడు రౌండ్లు వాకింగ్ చేసి అక్కడే ఉన్న సిమ్మెంట్ బెంచీ మీద కూర్చుంటారు కుడుపూడి సూర్యనారాయణ గారు. మళ్లీ సాయంత్రం ఐదు దాటిన తర్వాత వెళ్లండి. సేమ్ సీన్ రిపీట్. మధ్యలో ఎక్కడుంటారూ అని అడగకండి… నే చెప్తా. హైస్కూల్ ఎదురుగా ఉన్న ఆయన సామాజిక వర్గం వారి భవనంలో ఆయన ఆఫీసులో ఉంటారు. ఎవరెళ్లినా నవ్వుతూ …షేక్ హ్యండ్ ఇచ్చి “అదా పని, చేసేద్దాం. ఎవరికి చెప్పాలి. ఎస్పీ గారికా.. కాదా కలెక్టర్ గారికా. చెప్దాం” అంటారు. అలా అంటూనే అక్కడే ఉన్న పీఏ వైపు చూస్తారు. ఫోన్ కలుపుతారు. ఈయన మాట్లాడతారు. ఆ వచ్చిన వాళ్లకి “నే మాట్లాడా. అయిపోతుంది. వెళ్లండి” అని పక్కన ఉన్న వారివైపు చూస్తారు. అలా చూసేది రాజకీయ నాయకుల్లో ఈ కుడుపూడి సూర్యనారాయణ గారొక్కరే నాకు కనిపించారు. మిగిలిన వారు ఉన్నారేమో… నాకు కనిపించలేదు.