కూచిమంచి మల్లపరాజు

( రైతువాది …. ఈ న్యాయవాది )

డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యానంటారు కొందరు నటీనటులు. ఇలాగే ఇంచుమించు సరిసాటి అన్నట్లు ఈ లాయర్‌ కూడా అంతే. లెక్చరర్‌ అవ్వాలన్నది ఆయన చిన్ననాటి కల. ఆ కల ఈడేరక లాయర్‌గా స్థిరపడిన వారే కూచిమంచి మల్లపరాజు. అమలాపురంతో పాటు రాజమండ్రి, కాకినాడ కోర్టుల్లో కూడా మల్లపరాజు లాయర్లందరికీ రారాజే. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు లాయర్‌ వృత్తిలో ఉండి ప్రస్తుతం అమలాపురంలోనే విశ్రాంత జీవితం గడుపుతున్న మల్లపరాజు గారి చదువు ముక్తేశ్వరంలో ప్రారంభించారు. పదో తరగతి వరకూ అక్కడే చదివిన ఆయన ఇంటర్‌, డిగ్రీ  మన ఎస్‌కేబీఆర్‌ కళాశాలలోనే చదివారు. నిజానికి  లెక్చరర్‌ కావలన్న కలకి కారకులు అప్పటి లెక్చరర్లు పేరి శాస్త్రిగారు, గుర్రం ప్రకాశరావే గారే బీజం వేశారు. ఇంతా చేసి ఈ కోరిక వెనుక ఉన్నది పాఠాలు చెప్పేయాలని కాదు. కోటు వేసుకుని, టై కట్టుకుని కాళ్లకి బూట్లు తొడుక్కుని ఎంతో దర్జాగా క్లాస్‌ రూం కి వచ్చిన ఆ ఇద్దరు లెక్చరర్లను చూసి కోటు, బూటు, టై మీద పెరిగిన మమకారమట. లెక్చరర్‌ కల తీరలేదు కాని…. కోటు, బూట్లు కల తీరింది. ఎలాగంటారా… ఇదిగో న్యాయవాదిగా మారి. మరి టై మాటేమిటి అనే అనుమాన  డౌట్‌ రావచ్చు. అదీ తీరింది శుభకార్యాల సమయంలో. అందు వలన చేత ఏమర్థం అవుతుందంటే ఓ లక్ష్యం ఉంటే అది నెరవేర్చుకోవచ్చునని. 

డిగ్రీ చదివేశాక… అదియునూ ఫస్ట్ మార్కులతో ప్యాసు అయ్యాక హిందూ బెనారస్‌ యూనివర్శిటీలో ఎంఏ ఎకనమిక్స్ లో చేరేందుకు అవకాశం వచ్చింది. అంటే కాశీ విశ్వనాథుని సన్నిధి వద్ద చదువుల తల్లి సీటిచ్చింది. ఈ కూచిమంచి వారి ఇష్టదైవం చంద్రమౌళీశ్వర స్వామి వారు కదా… అందుకే ఆయనే ఈ సీటు వచ్చేలా చేసుంటారని నాకెందుకో అనిపిస్తోంది. కానీ… మళ్లీ ఏంటి ట్విస్టు అంటారా. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లు…. ఇక్కడ రివర్స్ అయ్యింది. ఎలాగంటే మల్లపరాజుగారి తండ్రి శ్రీరామమూర్తిగారి స్వయానా బావ రూపంలో వచ్చింది ఆ ట్విస్టు. ఈ బావ శివరావుగారు ఆంధ్రా యూనివర్శిటీలో రీడర్‌గా ఉద్యోగిస్తున్నారు. ఏదో శుభకార్యానికి అమలాపురం వచ్చి… అక్కడ బావ గారు శ్రీరామమూర్తి గారిని, పనిలో పనిగా మల్లపరాజుగారిని చూసి… “ఏవండోయ్‌ బావ గారు…ఈ మీ మల్లపరాజు చదువులో దిట్టలా కనిపిస్తున్నాడు. మీ అన్న ప్రకాశం గారికి లాయర్‌  వృత్తిలో వారసుడు అయ్యేలా ఉన్నాడు” అన్నారట. ఆనక “ఆ బెనారస్సూ,… కాశీ ఎందుకు కానీ చహ్హగా ఇసాకపట్నంలో లాయర్‌ చదివించేయండి. మీ కళ్ల ముందుంటాడు కుర్రాడు” అని చెప్పేసి విశాఖపట్నం వెళ్లిపోయారు. అప్పటికే బెనారస్‌కు బట్టలు గట్రా సర్దేసుకున్న మల్లపరాజు గారికి ఈ మాట జడ్జి గారి చేతిలో సైలెంట్‌ అంటూ బల్ల మీద చరిచే చెక్క సుత్తిలా తోచిందట. మరో పక్క బావ గారు చేసిన ఆలోచన నచ్చిన శ్రీరామమూర్తిగారు “మావయ్య చెప్పినట్లు అలా చేద్దాం రా. వెళ్లి విశాఖపట్నంలో లాయర్‌ చదువు చదివేసిరా” అని స్టీరింగ్‌ని విశాఖపట్నం వైపు తిప్పేశారని మల్లపురాజు గారు నాకు చెబితే నేను మీకు చెబుతున్నాను. ‘తండ్రి మాట జవదాటనిది రాముడే కాదుస్మీ, నేను కూడా’ అని ప్రపంచానికి చెప్పాలనిపించి మల్లపరాజు గారు విశాఖపట్నం వెళ్లి హాయిగా చదువుకున్నారు. లాయర్‌  పట్టా తీసుకుని సరాసరి అమలాపురం వచ్చి పెద్దనాన్న గారైన ప్రకాశం గారి దగ్గర జూనియర్‌గా చేరిపోయారు.
ఇక్కడింకో విషయం చెప్పాలి. ఆంధ్రా యూనివర్శిటీలో విద్యార్థుల ఎన్నికలొస్తే మల్లపరాజుగారు బలపరిచిన ప్యానెల్‌ విజయం సాధించింది. దీనికి పునాది కూడా మన ఎస్‌కెబీఆర్‌ కాలేజీయే. ఎలాగంటారా… అమలాపురంలో చదువుతున్నప్పుడు  డిగ్రీ కాలేజీలో కూడా ఎన్నికలు వస్తే దాన్ని నడిపించి తన టీంని గెలిపించింది మల్లపరాజుగారే. ఈ రాజకీయమే ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనూ ఉపయోగపడింది. ఆ ఎన్నికల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యర్థిని ఓడించడంలో భాగంగా కాకినాడ విద్యార్థులు ఓటేయకూడదని మొదట రాజకీయ పావు కదిపారు. ఆ తర్వాత అది అలా అలా యూనివర్శిటీ అంతా పాకి లోలోపల ఓ ఉద్యమమైంది. అది కాస్తా మల్లపరాజు గారు మద్దతు పలికిన భాస్కర ప్రపాద్‌ అనే ఓ బుద్ధిమంతుడ్ని యూనివర్శిటీ అధ్యక్షుడ్ని చేసింది. ఇది అమలాపురం మార్కు రాజకీయం అన్నమాట. 
న్యాయవాద చదువు ముగిసింది. పట్టా వచ్చింది. ఇక బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌మెంట్ మిగిలింది. కాని మల్లపరాజు గారి మనసంతా ఉద్యోగం మీదే ఉంది. ఇదంతా ఎప్పుడంటరా… 1964 సంవత్సరం  16వ తేదిన. లాయర్‌ కదా.. చట్టాలు గుర్తున్నట్లే ఈ తేదీలు గట్రా మల్లపరాజు గారికి గుర్తు. అయితే తండ్రి, పెదతండ్రి పట్టుదలతో ఓ మూడేళ్లు లాయర్‌గా చేద్దామని, ఈ వృత్తిలో నిలబడలేకపోతే అప్పుడు ఉద్యోగం చూసుకుందాం లెమ్మని ‘మమ’ అనుకుని ప్రకాశం గారి దగ్గర చేరారు. ఆ తర్వాత ఇంకేముంది ఐదున్నర దశాబ్దాల సక్సెస్‌ స్టోరీగా మిగిలారు మల్లపరాజు గారు. 
న్యాయవాదిగా తొలి కేసు వల్ల వచ్చిన రాబడి… అదే ఫీజు… ఓ ఐదు రూపాయలు. ఇంత తక్కువా అనకండి. ఆ రోజుల్లో ఐదు రూపాయలకి తులం బంగారం వచ్చేదని అమలాపురంలో ఓ బంగారం షాపాయన చెప్పారు. ఇంతకీ కేసేంటంటే ఓ ఆసామి అప్పు చేసి తీర్చడం లేదు. అతడ్ని కస్టడీలోకి తీసుకోవాలని వాదించాలి. మహానుభావుడు చనిపోయి ఎక్కడున్నారో రేమళ్ల రామచంద్రరావు గారే ఈ కేసు వాదించమని మల్లపరాజు గారిని ప్రోత్సహించారట. ఆ రేమళ్ల గారు గుమాస్తా కదా… అందుకని ఆయన వెనకుండి ధైర్యం చెప్పారని మల్లపరాజు గారే నాతో స్వయంగా అన్నారు. కేసు బెంచీ మీదకి వచ్చింది. “యువర్‌ ఆనర్‌” అంటూ ధైర్యంగా ఆర్గుమెంటూ చెప్పేశారు. జడ్జిగారు తీర్పు చెబుతూ “ఆ ముద్దాయిని అరెస్టు చేయండి” అన్నారు. అలా అంటూ మల్లపరాజు గారి వైపు “శభాష్‌… నీకు ఉజ్వల భవిష్యత్‌ ఉందంటూ” కళ్లతో ఆశీర్వదించారట.
1973 సంవత్సరంలో ల్యాండ్‌  సీలింగ్‌ యాక్ట్ వచ్చింది, నిజానికి న్యాయవాదులను సమాజంలో గొప్పవారిగా చూపించింది ఆ చట్టమే. ఈ చట్టం రాగానే మల్లపరాజు గారు రైతుల పక్షాన అధమ పక్షం 500 డిక్లరేషన్లు ఇచ్చారట. ఇది ఆయనను అమలాపురంలో ఉన్న లాయర్లలో మూడో స్థానంలో ఉంచింది. మొదటి స్థానం పాలగుమ్మి సూర్యారావు గారిది, రెండో స్థానం సాధనాల వెంకట్రావు గారిది. వాళ్లతో పోలిస్తే మల్లపరాజు గారు పిన్న వయస్కులు అన్నమాట. కానీ సాధించింది మాత్రం కొండంత. ఈ మాటలు చెబుతూంటే మల్లపరాజు గారి కళ్ళు ఎందుకో భలే మెరిసాయి. ఆ మెరుపులో గర్వం కనిపించలేదు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. ఈ చట్టం పరిధిలోకి రాకుండా ఏకంగా పది వేల ఎకరాలు కాపాడారు మల్లపరాజు గారు. అంటే ఓ రెండు వేల మంది రైతులని అన్నమాట. ఫీజులు చెల్లించని వారి కేసులు వాదించి వారి ఆస్తులు వాళ్ల చేతిలో పెట్టించింది కూడా ఈ మల్లపరాజు గారే. ఇలా ఓ 50 – 60 కుటుంబాలకు చెందిన వారి వారసులు మల్లపరాజు గారిని చూడడానికి ఇప్పటికీ అమలాపురం వస్తూంటారు. ఇలా వస్తూ వస్తూ వాళ్ల పొలంలో పండిన కూరగాయలో, అరటికాయలో, కొబ్బరి బొండాలో ఇచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టి వెళ్లి పోతారు.
అమలాపురంతో పాటు మరో నియోజకవర్గానికి కూడా ఉపయోగపడేలా కొంత మంది పెద్దలు ఓ బ్యాంకు పెట్టారు. అంటే ల్యాండ్‌ బ్యాంక్‌ అన్నమాట. దానికి అధ్యక్షుడిగా మల్లపరాజు గారే. ఎన్‌.టీ.రామారావు ముఖ్యమంత్రి అయ్యే వరకూ అది బాగానే ఉంది. ఆ తర్వాతే ఆ బ్యాంకుల్ని కో-ఆపరేటివ్‌ బ్యాంకుల్లో కలిపేయాలనే జీవో తెచ్చారు ఎన్టీఆర్‌. ఓ రెండు వందల మంది కార్లలోను, బస్సుల్లోనూ, రైళ్ళలోను హైదరాబాద్ వెళ్లి ముఖ్యమంత్రి అన్న ఎన్‌టీఆర్‌ని కలిసి… ఇలా కలిపేయకండి బాబూ అని అడిగారు. దానికి  ఎన్‌టీఆర్‌… మల్లపరాజు గారి భుజం మీద చెయ్యి వేసి “అలాగే బ్రదర్‌. మిమ్మల్ని ఇబ్బంది పెట్టం” అని హామీ ఇచ్చారు. రాజకీయులు కదా చెప్పినట్లే చెప్పి వెనుక నుంచి జీవో ఇచ్చేశారు. అప్పుడు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి అక్కడున్న నాబార్డు అధికారుల్ని, మంత్రుల్ని కలిసి “ఇది బాబు, ఇలా జరిగిందంటే” ఆ పెద్దలు జీవోని నిలిపేశాలా ఆర్డరు వేశారు. అలా ఆర్డర్‌ వేయించిన వాళ్లలో మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు గారు కూడా ఉన్నారట. ఇదీ మల్లపరాజు గారు చేసిన మంచి పనుల ఖాతాలో జమ అయ్యేదే.
అమలాపురంలో రోటరీ క్లబ్‌ వచ్చింది… ఆనక అది వటుడింతై అని పెరిగింది మల్లపరాజు గారి హయాంలోనే. కూచిమంచి అగ్రహారం చివర్లో శంకరమఠం పక్కన ఉన్న స్థలాన్ని కొని అందులో కల్యాణ మండపం, పెళ్లికి హాలు, అతిథులకు రూంలు కట్టారు. ఆదీ మల్లపరాజు గారి ఖాతాలోనిదే. 
ఇంత చెప్పుకున్నాక కుటుంబం గురించి కూడా చెప్పుకోవాలి కదా. ఆయ్‌! అంచేత… మల్లపరాజు గారికి పెద్ద పెద్ద కళ్ళు ఇష్టం. అలాంటి కళ్ళుంటే మనకి భాగ్యం అనే నమ్మకం, ఇష్టం. అందుకే అంత పెద్ద కళ్ళున్న నామణిగారిని వివాహమాడారు. ఈ దంపతులకి ముగ్గురు సంతానం. తన వారసత్వ సంపదగా వచ్చిన ప్లీడరీగిరిని పెద్ద కుమారుడు శశికి అప్పగించారు. తండ్రిలాగే ఈ శశి కూడా పెద్ద లాయర్‌గా పేరు తెచ్చుకునే ప్రయత్నాన్ని అమలాపురం నుంచే చేస్తున్నాడు. ఇక రెండో అబ్బాయి కిష్టప్ప. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కుమార్తె బిందు. హైదరాబాద్‌లో భర్తా, పిల్లలతో ఉంటున్నారు. 
మల్లపరాజు గారు అజాత శత్రువేం కాదు. కోర్టులో చాలా మందే శత్రువులున్నారు. చిత్రంగా వాళ్లంతా కోర్టు బయట మాత్రం మంచి మిత్రులు. అందుకే… ఇందుకే కోర్టులో మల్లపరాజు పగబట్టిన శత్రువులా వాదిస్తారు. కోర్టు బయట చిన్ననాటి స్నేహితుడిలా కలిసిపోతారు. కొందరితో కాదు… అందరితోనూ…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top