This page is dedicated to those Alumni who won laurels in their fields of work.
We will publish details of One Great Personality. In every 15 days
వారానికో మంచి ముత్యం

వక్కలంక రామకృష్ణ
సంఘ సేవకులు
2003 వ సంవత్సరం గోదావరి పుష్కరాలు. అశేష భక్త జనవాహిని. ఓ నాలుగైదు సంవత్సరాల కుర్రాడు అమ్మా… నాన్నా అంటూ గోదారొడ్డు మీద ఏడుస్తూ తిరుగుతున్నాడు. అందరూ ఎవరి భక్తి పారవశ్యంలో వారున్నారు. సాయంత్రం వరకూ అలా ఏడ్చిన కుర్రాడిని రైల్వే పోలీసులు చూశారు. చేరదీసారు. అన్నం పెట్టారు. ఊరు, పేరు అడిగారు. ఆ పిల్లాడు ఏడుస్తున్నాడే తప్ప ఏం చెప్పడం లేదు. పుష్కరాల హడావుడి తగ్గింది. స్నానాలతో పుణ్యం వచ్చేసిందని విశ్వసించిన వారంతా ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ పిల్లాడు రైల్వే పోలీసుల దగ్గరే ఉండిపోయాడు. ఆ పోలీసులకు తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో పరివర్తన అనే వీధిబాలలను చేరదీసే ఆశ్రమం ఉందని తెలిసింది. అక్కడికి తీసుకొచ్చి వివరాలు తెలియవని, మీరే సాకండి అంటూ ఆ ఆశ్రమ నిర్వహకుడికి అప్పగించారు. అలా కుర్రాడిని చేతుల్లోకి తీసుకున్నది అమలాపురం కాలేజీలో చదివి అనాథ ఆశ్రమం నడుపుతున్న వక్కలంక రామకృష్ణ.
* * *
22 సంవత్సరాల క్రితం అలా ఆశ్రమానికి వచ్చిన కుర్రాడు 2025 సంవత్సరంలో ఇదిగో ఈమధ్యనే మహా ప్రాణదీపం శివం అంటూ పరవశంగా పాడిన హరిహరన్ దగ్గర సంగీత కళాశాలలో హిందూస్థానీ ఫ్యాక్టలీగా చేరాడు. ఈ ఫ్యాకల్టీ… గోదావరి పుష్కరాల రోజు తప్పిపోయిన రియాలిటీ ఒక్కరే. తేడా ఏంటయ్యా అంటే ఆ కుర్రాడ్ని హిందుస్థానీ సంగీత విద్వాంసుడిగా తీర్చిదిద్దింది అక్షరాల వక్కలంక రామకృష్ణే. ఆ పిల్లాడి పేరు చెప్పచ్చు. వక్కలంక రామకృష్ణ గారు నాకు చెప్పారు కూడా. కానీ నాకే చెప్పాలని లేదు. ఎందుకంటారా… ఆ పేరుతో పిలిచే ముందు పుష్కరాలకు తప్పిపోయిన కుర్రాడా అని అనేసుకుంటాం… ఆ కుర్రాడి దగ్గర అనేస్తాం. గాయాన్ని చేయడం కంటే దాన్ని రేపడం మరింత బాధాకరం. అందుకే చెప్పడం లేదు.
* * *
ఇది ఇంకో సంఘటన. నాగార్జున (ఇదీ పేరు మార్చాను). హొటల్లో కప్పులు కడిగే వాడు. పునరావాసం అంటారు కాని నేను మాత్రం దాన్ని పునర్జన అంటా. అలా ఆ కుర్రాడికి పునర్జన్మ ఇచ్చిందీ మన వక్కలంక రామకృష్ణ గారే. ఆ నాగార్జునని ‘పరివర్తన’ కు తీసుకువచ్చి స్నానం చేయించి తన కడుపులో దాచుకున్నది తీసి తినిపించి స్కూల్కి పంపారు. వాడేం చేశాడు? మళ్లీ పారిపోయాడా? కానే కాదు. ఓ చేతిలో పెన్సిల్తో బొమ్మలేయడం ప్రారంభించాడు. ఏడో తరగతి చదువుతూండగా వేసిన బొమ్మలకి తెలంగాణలోని కొత్తగూడెంలో నిర్వహించిన బాలోత్సవ్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేశాడు. ఈ బుడతడి బొమ్మలు చూసిన ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు గారు మురిసిపోయి “నువ్వు నాకంటే కూడా బొమ్మలు బాగా వేయగలవు. ప్రాక్టీస్ చెయ్యి ” అంటూ ఆశ్వీరదించారు. అంతేనా ఇంకా ఉంది. బోల్డు బొమ్మల పుస్తకాలు కూడా ఇచ్చారని వక్కలంక రామకృష్ణ గారు చెప్పారు. ఈ విషయం మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి.
* * *
పరివర్తనకు ముందు మన ఎస్కేబీఆర్ కాలేజీలోనే మొత్తం చదువంతా సాఫీగా సాగిందట. ఎందుకంటే ఆంధ్ర పుణ్యక్షేత్రాలు పాట రాసిన వక్కలంక లక్ష్మీపతిరావు గారి కుమారుడే ఈ రామకృష్ణ గారు. ఆయన మన కాలేజీలో తెలుగు లెక్చరర్. ఆయనకే కాదు కాలేజీలో ఉద్యోగులందరికీ నాలుగైదు నెలలకే జీతాలు. అయినా లెక్చరర్లందరూ సొంత పిల్లలకి చెప్పినట్లే భావించి పాఠాలు చెప్పేవారు. తన కొడుకు రామకృష్ణకి చెప్పిన పాఠం ఏమిటంటే “ఆకలేస్తోందన్నా… సాయం చేయమని ఎవరైనా అడిగినా, నువ్వు మానేసి వారికి చేతనైన సాయం చెయ్యి” అన్నారట. ఆ చేతనైన సాయం అలా అలా పెరిగి పరివర్తనగా రూపాంతరం చెంది ఇప్పటి వరకూ 750 మంది పిల్లలని పెంచి పెద్దవారు చేశారు. వారిలో చాలా మంది బాగా సెటిల్ అయ్యారని వక్కలంక రామకృష్ణ గారు చెబుతూంటే సెల్ఫోన్ సిగ్నల్స్ బాగా పని చేశాయేమో, కాని ఆయన గొంతు జీర పోవడం నా ఎడమ చెవికి సోకింది.
డిగ్రీ చదివేశాక ఎల్ఐసీలో చేరిన వక్కలంక రామకృష్ణ అక్కడ కూడా తన దగ్గరున్న ఏజెంట్లకి ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. అమలాపురం కాలేజీలో చదువుతూండగానే కవిత్వంతో కూడా పరిచయం ఏర్పడిందని, అది తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వమని అన్నారాయన. కాలేజీ స్విలర్ జూబ్లీ వేడుకలు జరిగితే పనిలో పనిలో కవి సమ్మేళనం కూడా పెట్టారట. ఆ రోజు వేదిక మీద అద్దేపల్లి రామ్మోహన్ రావు వంటి పెద్ద కవుల పక్కన ఈ రామకృష్ణ, ఆ గోపాలకృష్ణ… అదే పెమ్మరాజు వారబ్బాయి కూర్చున్నామని అన్నారు. ఆ మయంలోనే రోటరాక్ట్లో చేరిన వక్కలంక రామకృష్ణ అనేక కార్యక్రమాలు చేసేవారు. కూచిమంచి సత్యానందరావు గారి నుంచి ఇంగ్లీషు గ్రామర్ నేర్చుకున్న ఆ గ్రామర్ని కాలేజీలో జూనియర్ విద్యార్థులకి క్లాసులు తీసుకునే వారు.
కాకినాడలో ఉంటున్న వక్కలంక రామకృష్ణ గారికి వేరే పనులు చాలా ఉన్నాయి. అక్కడి గాంధీ భవన్కు ఈయనే ఇన్చార్జి. అలాగే ప్రజా వైద్యశాల, పిఆర్ కాలేజీ గౌరవ సభ్యుడు, జెఎన్టియు నేషనల్ సర్వీస్ స్కీం సభ్యుడిగాను కూడా రామకృష్ణ ఉన్నారు. కరోనా సమయంలో వక్కలంక రామకృష్ణ చేసిన సేవలు చాలా మంది చెప్పుకుంటారు. ఆయన మాత్రం నవ్వుతారు. “కష్ట సమయం కదా చేయాలి కదా” అంటారు. వాటి వివరాలు అడిగితే కూడా “చేశాను కదా చక్రి… చెప్పుకోవడమెందుకు” అన్నారు. అసలివ్వన్నీ చెప్పుకోవడం ఎందుకంటే మన కాలేజీ అందించిన ముత్యం కదా… అందుకని చెప్పుకోవాలన్న మాట.
– ముక్కామల చక్రధర్