Author name: gloriousskbralumni.org

Blog

నడింపల్లి సీతారామరాజు

సేవల్లో రాజుగోరు జర్నలిజంలో సానా పెద్దోరు) మూడు దశాబ్దాల క్రితం. ఓ సాయంత్రం వేళ హైదరాబాద్‌లో రాంనగర్‌ వెళ్లే దారిలో విఎస్‌టీ ఫ్యాకర్టీ గోడకి ఎదురుగా ఉన్న ఉదయం దిన పత్రిక ఆఫీసులో ఓ మూల కూర్చుని వార్త రాసుకుంటున్నాను. అది ఉదయంలో సిటీ డెస్క్. డెస్క్‌ ఇన్‌చార్జి, కొందరు సబ్‌ ఎడిటర్లు పనిలో ఉన్నారు. నేను ఆ రోజు మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమం రిపోర్ట్‌ రాసుకుంటున్నారు. తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకుని ఎర్ర శరీర రంగులో, కాసింత గిరజాల జట్టు, కొనదేరిన ముక్కు ఉన్న ఓ పెద్దాయన డెస్క్‌ దగ్గరికి వచ్చారు. డెస్క్‌ ఇన్‌ఛార్జితో “ఈ రోజు సిటీ టాబ్లాయిడ్‌ రెండో పేజీలో హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు కథనం రాసింది ఎవరు” అని అడిగారు. సిటీ డెస్క్‌ ఇన్‌చార్జి కాసింత దూరంగా ఉన్న నన్ను చూపించి “కొత్త కుర్రాడు సార్‌. చక్రధర్‌ అని. ఏమైంది సార్‌” కాసింత భయంగానే అడుగుతూ నన్ను రమ్మని చేతులతో సైగ చేశారు. నేను వెళ్లి వారిద్దరికి దగ్గరగా నుంచున్నా. “ఈయన చీఫ్‌ రిపోర్టర్‌. నడింపల్లి సీతారామ రాజు గారు. నిన్న వార్త ఎవరు రాసారు అని అడుగుతున్నారు” అన్నారు నాతో. నేను కాసింత భయంతోనే “తప్పు రాసానారా సార్‌” అని అడిగా. దానికి ఆ నడింపల్లి సీతారామ రాజు గారు “తప్పు కాదు. చాలా బాగా రాసావు. కొత్త రిపోర్టర్‌ రాసినట్లు లేదు. అభినందిద్దామని వచ్చా. ఏ ఊరు మీది” అన్నారు. “మాది అవలాపురం అండి” అన్నాను. “మాది అవలాపురమే. ఇలాగే రాయి. పైకి వస్తావు. ముఖ్యంగా పత్రికలు చదువు” అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారేమో… ఎందుకంటే ఈ నడింపల్లి సీతారామ రాజు గారు మంచి ఎక్కడ ఉంటే అక్కడుంటారు అని చెప్పడానికి. పత్రికల్లో పని చేసిన వారికి.. ముఖ్యంగా సీనియర్లకు కింది ఉద్యోగులంటే ఇష్టం ఉండదు. వారితో మాట్లాడడం నామోషి అనుకుంటారు. అలా “పడదు.. నామోషి” వంటి మాటలు ఈ నడింపల్లి రాజుగారికి తెలీదు. ఈయన మనుషుల్ని ప్రేమించడంలోను, సమాజానికి ఏదైనా చేయాలనే తపనలోనూ రారాజే అని చెప్పడానికి ఇదంతా.కోనసీమలోని ఓ పల్లెటూరు నుంచి అమలాపురం వచ్చి ఎస్‌కేబీఆర్‌ కాలేజీలో పీయూసి, డిగ్రీ చదివారు. కూచిమంచి అగ్రహారంలోనే మరో నలుగురు సహాధ్యాయులతో కలిసి ఓ రూంలో ఉండి చదువుకున్నారు. ఇప్పుడంటే ఇన్ని హొటళ్లు వచ్చాయి కాని ఆ రోజుల్లో వొటేళ్లు లేవు. ఇంటి నుంచి ఎవరో ఒకరు సైకిల్‌కి క్యారేజీలు కట్టుకుని వచ్చి చదువుకునే వారికి ఇచ్చేవారు. ఇది రెండు పూటలా జరిగే నిత్య కృతువు. విద్యార్థి దశలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో ఉండే వారట సీతారామ రాజు గారు. అందులోనూ ఈయనకి గురువు వారణాసి సూర్యనారాయణ గారు. అంటే ఆ మధ్య కేంద్ర బీజేపీలో ఓ చక్రం తిప్పారు చూడండి రామ్‌మాధవ్‌. వాళ్ల నాన్నగారన్నమాట. ఆయనతో కలిసి కోనసీమే కాదు చాలా ప్రాంతాలు తిరిగారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తర్వాత అఖిల భారత విద్యార్ధి పరిషత్‌ నాయకుడిగా ఎదిగారు. ఎదగడం అంటే మామూలుగా కాదు. ఎబీవీపీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి . అమలాపురంలో ఏబీవీపీ జిల్లా క్యాంపు నిర్వహించింది ఈ నడింపల్లి సీతారామరాజు గారే. ఆ క్యాంపుకి వచ్చిన వాళ్లలో మాజీ ఉప రాష్ట్రపతి ముప్పరపు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఇంతే కాదు… బెనారస్‌ యూనివర్శిటీలో ఆర్‌ఎస్‌ఎస్ అగ్ర నాయకుడు గోవాల్కర్‌ దగ్గర శిష్యుడిగా కొన్నాళ్లు పని చేశారు. ఈయన కమ్యూనిస్టు కదా… ఇవన్నీ ఏంటి అనుకున్నాను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు. ఆ మార్పు ఆయనే చెప్పారు. ప్రజల కోసం పని చేయాలి కాని… ఈ క్యాంపులు అవీ కాదు అనుకుంటున్న సమయంలోనే సైద్ధాంతిక విబేధాలతో అక్కడి నుంచి వచ్చేశారు. అప్పటికే నక్సల్బరీ ఉద్యమం సెగలు శ్రీకాకుళం పోరాటం వైపు వీచడం, ఆ వేడి గాలులు నడింపల్లి వారిని కూడా తాకడంతో నక్సల్స్‌ సానుభూతిపరుడిగా తనను తాను మార్చుకున్నారట. ఇక్కడ చిన్న స్వవిషయం. నేను కూడా అలా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావంతో కొన్నాళ్లు ఉండి ఆ తర్వాత కమ్యూనిస్టుగా మారి జర్నలిస్టుగా స్ధిరపడిన వాడినే. అంటే ఒక్కో తరంలో ఇలాంటి వాళ్లు ఆనాడు ఉండే వారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే విద్యార్ధులే కాన రారు. అదో విషాదం.ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో విద్యార్ధుల ఎన్నికలు వచ్చాయి. అందరూ సీతారామ రాజు గారిని పోటీ చేయమన్నారు. కానీ, ఈయన బలవంతంపై గోకరకొండ విజయరామారావుని అధ్యక్షుడిగా నిలబెట్టి గెలిపించింది ఈ నడింపల్లి వారబ్బాయే. జై ఆంధ్రా ఉద్యమం గుర్తుందా… ఆ ఉద్యమానికి జాయింట్‌ కన్వీనర్‌ కూడా ఈ సీతారామరాజు గారే అని తెలిసి ఒకింత ఆనందపడ్డాను. మీరు సంతసిస్తారని చెబుతున్నాను అంతే. విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు ఉద్యమం నడిచింది కదా. అందులోనూ ఈ సీతారామరాజుగారి పాత్ర చాలా పెద్దదే. ఈ మధ్యంటే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం జరుపుతున్నారు కాని… ఆ రోజుల్లోనే హిందీ నహీహై… తెలుగు అచ్చాహై అని నినదించింది ఈయనే. కాకపోతే తెలుగులోనే నినాదాలు చేశారు. జై ఆంధ్రా ఉద్యమంలో భాగంగా గడియారస్థంభం దగ్గర వేల మంది ఆందోళన చేస్తే అది కాస్తా పోలీసు కాల్పుల వరకూ వెళ్లింది. ఒకవేళ అదే జరిగి ఉంటే పొట్టి శ్రీరాములు వంటి వారు మన అమలాపురంలోనూ ఉన్నారని గుండెలు ఉప్పొంగించి చెప్పుకుందుము. ఈ ఉద్యమంలోనే నడింపల్లి వారిని అరెస్టు చేసి రాజమండ్రి జైలులో ఖైదు చేశారట ఓ నాలుగు నెలలు. అన్నట్లు అప్పుడే ఆయనకి పాప పుట్టింది. ఆ అమ్మాయికి అరుణ అని పేరు పెట్టుకున్నారు.సరే, మన కాలేజీలో ఈ నడింపల్లి సీతారామరాజు గారికి చాలా ఇష్టమైన లెక్చరర్‌ పొలిటికల్‌ సైన్స్‌ చెప్పిన జి.వెంకటేశ్వర రావుగారు. ఇక ఈయనకు సూర్ఫినిచ్చింది మాత్రం ప్రిన్సిపాల్‌ రమేశం గారు. కాలేజీ గురించి చెప్పండి అంటే సీతారామరాజు గారు వెంటనే తడుముకోకుండా అన్న మాట “One Of the Best College”.కాలేజీ రోజుల్లోనే నడింపల్లి వారి జర్నలిజం ప్రారంభమైంది. ఎలా అంటే… స్వామి వివేకానంద గురించి రాసిన ఓ వ్యాసం ఆంధ్రప్రభకి పంపితే వాళ్లు వెంటనే ముద్రించారు. అది కూడా ఆ వ్యాసానికి పారితోషికం అక్షరాలా… 30 రూపాయలు. అందులో 15 రూపాయలు ఖర్చు చేసి ఐదు దుప్పట్లు కొని బస్టాండ్‌ దగ్గర దిక్కుమొక్కులేని వారికి అర్ధర్రాతి కప్పారట. ఇప్పుడు పది వేల రూపాయలు సూట్‌ వేసుకున్నా రాని తృప్తి ఆ రాత్రి దక్కింది అన్నారు సీతారామరాజుగారు.ఉదయం దినపత్రికతో పాటు బొబ్బిలిపులి పక్ష పత్రిక, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో పని చేసిన సీతారామరాజు గారికి పెద్ద ఎన్టీఆర్‌ చాలా ప్రాధాన్యం ఇచ్చే వారు. అది ఎంత అంటే….”రాజుగారు మీరు పోటీ చేయండి” అన్నంత. ఈయనకి ఇష్టం లేదు కదా… వద్దండి అని సున్నితంగా తిరస్కరించారు. ఓ విధంగా మాజీ నక్సలైట్‌ కదా… అందుకని “ఈ పార్లమెంటరీ ఎన్నికలపై నాకు నమ్మకం లేదండి” అని కూడా చెప్పారట. ఎన్టీఆర్‌, వీ.పీ.సింగ్‌, యాసర్‌ ఆరాఫత్‌ వంటి హేమాహేమీలను ఇంటర్వ్యూ చేసింది కూడా ఈయనే. ఎన్టీఆర్‌ అవార్డుతో పాటు అనేకానేక అవార్డులు ఈ నడింపల్లి వారి అడ్రస్ కనుక్కుని వచ్చి వాలాయి. సెన్సార్‌ బోర్డుకు ఏకంగా 15 సంవత్సరాల పాటు ఏకధాటిగా సభ్యుడిగా ఉన్నారు. అందుకేనేమో ఈయనతో మాట్లాడుతూంటే చాలా విషయాలు సెన్సార్‌ అయిపోయాయి. జర్నలిస్టుగా ది ఎకానమిస్టులో చిన్న వార్త రాయడమే కష్టం. అలాంటిది నడింపల్లి సీతారామరాజు గారు ఏకంగా కవర్‌ స్టోరీ రాసేశారు. నా ఎరుకలో ఓ తెలుగు జర్నలిస్టుకు ఇలా రాసే అవకాశం చాలా అరుదు. చాలామందికి రాలేదు. ఈయనకి వచ్చింది. దీన్ని అదృష్టం అనరు గాక అనరు. దీన్ని ఇంగ్లీషులో టాలెంట్‌ అని, తెలుగులో ప్రతిభ అని అంటారని నాకు తెలిసొచ్చింది. చదువులో కూడా మంచి చురుకుగా ఉండే సీతారామరాజుగారు బాస్కెట్‌బాల్‌ కూడా ఆడేవారు. నేటి ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణ గారు తన బాస్కెట్‌బాల్‌ టీంలో సీతారామరాజుగారికి తప్పకుండా అవకాశం ఇచ్చేవారు.అమలాపురం పట్టణానికి మహాకవి శ్రీశ్రీ, మహా రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి, నగ్నముని, జ్వాలాముఖి, వరవరరావు వంటి మహానుభావులు వచ్చింది నడింపల్లి సీతారామరాజు గారి వల్లే. అమలాపురంలో విప్లవ రచయితల సంఘం సమావేశం పెట్టి వీరందరినీ పట్టణానికి తీసుకొచ్చారు. ఇదే కాదు… పౌర హక్కుల సంఘం సమావేశం పెట్టి పోలీసుల చేత వార్నింగ్‌ లాంటి హెచ్చరికలు అందుకున్నది కూడా నడింపల్లి సీతారామరాజు గారే. బంధువుల అమ్మాయి లక్ష్మీ కస్తూరిని వివాహం చేసుకుని ముగ్గుర పిల్లలకి జన్మనిచ్చారు. వారంతా విదేశాల్లో సెటిల్‌ అయ్యారు. తండ్రిలాగే పిల్లలు కూడా సాయం చేసే చేతులనే నమ్మున్నారు. ప్రార్థన చేసే పెదవులు చాలామందికే ఉంటాయి కదా… ఈ లాజిక్‌ మిస్‌ కాలేదు ఈ తండ్రి నడింపల్లి సీతారామరాజు గారు. ఆయన వారసులు.

Blog

కుడుపూడి సూర్యనారాయణ

( నడిచొచ్చే కొండ… ఈ కుడుపూడే అండ) నాకు మన ఎస్‌కేబీఆర్‌ కళాశాలే అన్నీ నేర్పింది. నేను అటు ఆటల్లోనూ, ఇటు నాయకుడిగాను ఎదగడానికి, నేటి నా అభ్యున్నతికి మన కాలేజే కారణం” అన్నారు ప్రస్తుత ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ నాతో. “ఇలా కాలేజీలో మీ అనుభవాల గురించి రాయాలండి. నాకు కొంత సమాచారం కావాలండి” అని అడిగితే ఆయన చెప్పిన మొదటి సమాధానం ఇది.ఇలా చెబుతున్నప్పుడు.. అసలే బాడీ బిల్డరేమో ఆ ఛాతీ కాస్త ఉప్పొంగడం చూసాను. దాంతో పాటు కనురెప్పలు బలవంతంగా అడ్డుకుంటున్న ఓ రెండు కన్నీటి బొట్లు కూడా కనిపించాయి. పెద్ద వారు కదా… పైగా ఎమ్మెల్సీ కూడా… బలవంతంగా ఆ ధారని ఆపుకున్నట్లుగా నాకు అనిపించింది. ఈ మాటలు అన్న వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మరోమాట… “ఆయన వల్లే నేను కాలేజీలో ఉండగా స్పోర్ట్స్‌లో ఇన్ని కప్పులు తీసుకురాగలిగాను”. “ఎవరండి ఆయన?” అనే నా ప్రశ్న పూర్తి కాకుండానే “పోడూరి కృష్ణమూర్తిగారు… మహానుభావుడు. నేను కప్పులు కొట్టుకొస్తే ఆయన సొంత కొడుకే గెలిచినట్లుగా సంబర పడిపోయే వారు. ఈ కాలేజీ, ఆ పోడూరి కృష్ణమూర్తి గారు లేకపోతే నేను ఏదైనా అవుదునేమో కానీ ఇలా మాత్రం కాకపోదును” అని కుడుపూడి సూర్యనారాయణ గారే మళ్లీ అన్నారు.అమలాపురంలోనే ప్రాథమిక విద్య చదివిన ఈయన పీయూసీ, డిగ్రీ కూడా ఎస్‌కేబీఆర్‌ కళాశాలలోనే చదివారు. ఇక్కడ చదువుతున్నంత సేపు చదువు కంటే ఆటల మీదే ఆయన దృష్టి. అన్నట్లు ఎక్కడికైనా వెళ్లి కప్పు కొట్టుకొస్తే అప్పటి ప్రిన్సిపాల్ రమేశం గారు “మన వాడు కప్పు తెచ్చాడు. కాలేజీకి సెలవు ప్రకటించండి” అనే వారని కూడా సూర్యనారాయణ గారు చెబితేనే నాకు తెలిసింది. డిగ్రీ పూర్తి చేశాక విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీలో పదిహేను సంవత్సరాలు చదివారు ఆయన. ఎంఏ హిస్టరీ, ఫిలాసఫీతో పాటు లా కూడా అక్కడే చదివారు. పదిహేను సంవత్సరాల పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే చదువుకున్న ఆయన ఆ సమయంలో అమలాపురం కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ ఓ పెద్దన్న. యూనివర్శిటీలో సీటు తెచ్చుకున్న విద్యార్థులకు హాస్టల్‌ వసతితో పాటు ఇతర విషయాలన్నీ దగ్గరుండి చూసుకునే వారు. కాలేజీ రోజుల నుంచే విద్యార్థి నాయకుడిగా ఎదిగిన నూర్యనారాయణ గారు ఆ వారసత్వాన్ని యూనివర్శిటీ వరకూ తీసుకెళ్లారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ కె.హరిబాబు వంటి ఆనాటి విద్యార్థులకు ఇతర విద్యార్థుల నుంచి సమస్యలు వస్తే ఈయనే ముందుండి ‘యుద్ధం’ చేసే వారు. సమైక్య రాష్ట్రానికి ఆనాడు డీజీపీగా పని చేసిన కుడుపూడి గోపాలకృష్ణ గోఖలే గారు వీరి తండ్రి, తల్లి మహాలక్ష్మి.బాస్కెట్‌ బాల్‌, ఫుట్‌బాల్ వంటి ఆటల్లో రాణించడమే కాదు బాడీ బిల్డర్‌గా కూడా వీరికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ పోటీల్లో కూడా అనేక టోర్నమెంట్లలో గెలిచి ఎస్‌కేబీఆర్‌ కళాశాలకే పేరు తీసుకువచ్చారు. “ఈ వయసులో కూడా నేను రోగాలకు, మందులకు దూరంగా ఉన్నానంటే కారణం నా బాడీ బిల్డింగ్‌, నేను ఆడిన ఆటలే” అంటూ ఓ నవ్వు నవ్వారు. ఈ నవ్వు వెనుక అర్థం ఇప్పుడు అందరూ ఆటలు చూస్తున్నారే తప్ప ఆడడం లేదని నాకనిపించింది. దేశానికి స్పీకర్‌ గా చేసిన బాలయోగి, కేంద్రమంత్రిగా చేసిన ఎర్రంనాయుడు, రాష్ట్ర మంత్రులుగా, స్పీకర్లుగా పని చేసిన కిమిడి కళా వెంకట్రావ్, తమ్మినేని సీతారాం, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ కూడా కుడుపూడి సూర్యనారాయణకు యూనివర్శిటీలో సహాధ్యాయులే.అన్నట్లు సుప్రీంకోర్టు మాజీ ఛీప్‌ జస్టిస్‌ చలమేశ్వర రావు గారు కూడా సూర్యనారాయణ గారికి మంచి స్నేహితుడు. ఆ స్నేహమే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సహకరించింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌.టీ.రామారావు దగ్గరకు ఈయన్నితీసుకువెళ్లింది జస్టిస్‌ చలమేశ్వరరావు గారే. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని అవకావం ఇస్తే “ఆయ్‌… మాది అమలాపురవండి. అక్కడి నుంచే పోటీ చేస్తానండి. ఇస్తే అక్కడి నుంచి ఇవ్వండి అవకాశం, ఆయ్‌” అన్నారట ఎన్టీఆర్‌తో. “అక్కడ మీ బాబాయ్‌ కుడుపూడి ప్రభాకర రావు గారు కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్నారు కదా…!” అని ఎన్టీఆర్‌ అడిగితే, “ఆయన మీదే పోటీ చేస్తానండి” అన్నానని సూర్యనారాయణ గారు చెప్పారు. ఆ సీటు ఇవ్వలేదనుకోండి, అది వేరే విషయం. అలా రాజకీయ ప్రవేశం చేసిన కుడుపూడి సూర్యనారాయణ గారు ప్రస్తుతం వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆటల్లో ముందున్న ఈయన చదువులో మాత్రం వెనుక బెంచీనట. “నేనెప్పుడు మార్చిలో పరీక్షలు రాసి పాస్‌ కాలేదు. అన్నీ సెప్టెంబర్‌లో రాసి పాస్‌ అయినవే” అన్నారు. దీని వెనుక ఉన్న కారణమేంటంటే మార్చిలో ఇచ్చిన ప్రశ్నలు సెప్టెంబర్‌లో ఇవ్వరని, ఆ ప్రశ్నలకి జవాబులు చదివి పాస్‌ కావచ్చుననే లాజిక్‌ వీరిది. అన్నిసార్లు అలా జరుగుతుందా అంటే జరగకపోవచ్చు. కానీ, ఈయన విషయంలో మాత్రం జరిగింది.క్రీడల కోటాలో చాలాచోట్ల ఉద్యోగాల అవకాశం వచ్చింది సూర్యనారాయణ గారికి. “అబ్బే! నేను ఒకరి దగ్గర చేయడవేంటి” అని న్యాయవాది వృత్తిలో స్థిరపడ్డారు. ఇలా న్యాయవాది అయినా ప్రతీ కేసు ఒప్పేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఉద్దేశ్యం లేదు. అందుకే క్రిమినల్‌ లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తూ మహిళలపై జరిగిన అకృత్యాలపై కోర్టులో వాదించే వారు. అన్నట్లు పైసా తీసుకోకుండా. ఈ లాయర్‌ వృత్తిలో ఆయనకు మిగిలిన సంతృప్తి మహిళల తరపున వాదించే లాయర్‌ అనే పేరు.తన జీవితంలో ఇంత ఎదగడానికి, అభివృద్ధిలోకి రావడానికి కారణం తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛే అన్నారాయన. బంధువులమ్మాయే డాక్టర్‌ విజయగారిని పెద్దలు కుదిర్చేలోపు ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. డాక్టర్‌ విజయ గారు ప్రభుత్వ వైద్యురాలిగా అమలాపురంలో పని చేశారు. కుడుపూడి సూర్యనారాయణ గారి విశిష్టత ఒకటుంది. అదేంటంటే… 1950 సంవత్సరంలో మూడు వేల రూపాయలకు కొన్న బుల్లెట్‌ బండినే ఇప్పటికీ వాడతారు. రేబాన్‌ కళ్లజోడుతో.. డుడుడుడుడు అంటూ సౌండ్‌ చేస్తూ ఎవరైనా వస్తున్నారంటే అది కుడుపూడి సూర్యనారాయణ గారే. ఇప్పుడు ఎమ్మెల్సీ కదా… అలా తిరగ్గూడదు కదా… అంటే గన్‌మెన్‌లు, కార్యకర్తలు గట్రా ఉంటారు కదా… అందుకని ఓ ఐదారుగురు పట్టే పెద్ద కారులో తిరుగుతున్నారు. తెలతెల వారుతూండగా అమలాపురంలోని బాలుర ప్రాథమిక పాఠశాలకు వెళ్లండి. అక్కడ గ్రౌండ్‌లో ఓ మూడు రౌండ్లు వాకింగ్‌ చేసి అక్కడే ఉన్న సిమ్మెంట్‌ బెంచీ మీద కూర్చుంటారు కుడుపూడి సూర్యనారాయణ గారు. మళ్లీ సాయంత్రం ఐదు దాటిన తర్వాత వెళ్లండి. సేమ్‌ సీన్‌ రిపీట్‌. మధ్యలో ఎక్కడుంటారూ అని అడగకండి… నే చెప్తా. హైస్కూల్‌ ఎదురుగా ఉన్న ఆయన సామాజిక వర్గం వారి భవనంలో ఆయన ఆఫీసులో ఉంటారు. ఎవరెళ్లినా నవ్వుతూ …షేక్‌ హ్యండ్‌ ఇచ్చి “అదా పని, చేసేద్దాం. ఎవరికి చెప్పాలి. ఎస్పీ గారికా.. కాదా కలెక్టర్‌ గారికా. చెప్దాం” అంటారు. అలా అంటూనే అక్కడే ఉన్న పీఏ వైపు చూస్తారు. ఫోన్‌ కలుపుతారు. ఈయన మాట్లాడతారు. ఆ వచ్చిన వాళ్లకి “నే మాట్లాడా. అయిపోతుంది. వెళ్లండి” అని పక్కన ఉన్న వారివైపు చూస్తారు. అలా చూసేది రాజకీయ నాయకుల్లో ఈ కుడుపూడి సూర్యనారాయణ గారొక్కరే నాకు కనిపించారు. మిగిలిన వారు ఉన్నారేమో… నాకు కనిపించలేదు.

Blog

కూచిమంచి మల్లపరాజు

( రైతువాది …. ఈ న్యాయవాది ) డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యానంటారు కొందరు నటీనటులు. ఇలాగే ఇంచుమించు సరిసాటి అన్నట్లు ఈ లాయర్‌ కూడా అంతే. లెక్చరర్‌ అవ్వాలన్నది ఆయన చిన్ననాటి కల. ఆ కల ఈడేరక లాయర్‌గా స్థిరపడిన వారే కూచిమంచి మల్లపరాజు. అమలాపురంతో పాటు రాజమండ్రి, కాకినాడ కోర్టుల్లో కూడా మల్లపరాజు లాయర్లందరికీ రారాజే. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు లాయర్‌ వృత్తిలో ఉండి ప్రస్తుతం అమలాపురంలోనే విశ్రాంత జీవితం గడుపుతున్న మల్లపరాజు గారి చదువు ముక్తేశ్వరంలో ప్రారంభించారు. పదో తరగతి వరకూ అక్కడే చదివిన ఆయన ఇంటర్‌, డిగ్రీ  మన ఎస్‌కేబీఆర్‌ కళాశాలలోనే చదివారు. నిజానికి  లెక్చరర్‌ కావలన్న కలకి కారకులు అప్పటి లెక్చరర్లు పేరి శాస్త్రిగారు, గుర్రం ప్రకాశరావే గారే బీజం వేశారు. ఇంతా చేసి ఈ కోరిక వెనుక ఉన్నది పాఠాలు చెప్పేయాలని కాదు. కోటు వేసుకుని, టై కట్టుకుని కాళ్లకి బూట్లు తొడుక్కుని ఎంతో దర్జాగా క్లాస్‌ రూం కి వచ్చిన ఆ ఇద్దరు లెక్చరర్లను చూసి కోటు, బూటు, టై మీద పెరిగిన మమకారమట. లెక్చరర్‌ కల తీరలేదు కాని…. కోటు, బూట్లు కల తీరింది. ఎలాగంటారా… ఇదిగో న్యాయవాదిగా మారి. మరి టై మాటేమిటి అనే అనుమాన  డౌట్‌ రావచ్చు. అదీ తీరింది శుభకార్యాల సమయంలో. అందు వలన చేత ఏమర్థం అవుతుందంటే ఓ లక్ష్యం ఉంటే అది నెరవేర్చుకోవచ్చునని.  డిగ్రీ చదివేశాక… అదియునూ ఫస్ట్ మార్కులతో ప్యాసు అయ్యాక హిందూ బెనారస్‌ యూనివర్శిటీలో ఎంఏ ఎకనమిక్స్ లో చేరేందుకు అవకాశం వచ్చింది. అంటే కాశీ విశ్వనాథుని సన్నిధి వద్ద చదువుల తల్లి సీటిచ్చింది. ఈ కూచిమంచి వారి ఇష్టదైవం చంద్రమౌళీశ్వర స్వామి వారు కదా… అందుకే ఆయనే ఈ సీటు వచ్చేలా చేసుంటారని నాకెందుకో అనిపిస్తోంది. కానీ… మళ్లీ ఏంటి ట్విస్టు అంటారా. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లు…. ఇక్కడ రివర్స్ అయ్యింది. ఎలాగంటే మల్లపరాజుగారి తండ్రి శ్రీరామమూర్తిగారి స్వయానా బావ రూపంలో వచ్చింది ఆ ట్విస్టు. ఈ బావ శివరావుగారు ఆంధ్రా యూనివర్శిటీలో రీడర్‌గా ఉద్యోగిస్తున్నారు. ఏదో శుభకార్యానికి అమలాపురం వచ్చి… అక్కడ బావ గారు శ్రీరామమూర్తి గారిని, పనిలో పనిగా మల్లపరాజుగారిని చూసి… “ఏవండోయ్‌ బావ గారు…ఈ మీ మల్లపరాజు చదువులో దిట్టలా కనిపిస్తున్నాడు. మీ అన్న ప్రకాశం గారికి లాయర్‌  వృత్తిలో వారసుడు అయ్యేలా ఉన్నాడు” అన్నారట. ఆనక “ఆ బెనారస్సూ,… కాశీ ఎందుకు కానీ చహ్హగా ఇసాకపట్నంలో లాయర్‌ చదివించేయండి. మీ కళ్ల ముందుంటాడు కుర్రాడు” అని చెప్పేసి విశాఖపట్నం వెళ్లిపోయారు. అప్పటికే బెనారస్‌కు బట్టలు గట్రా సర్దేసుకున్న మల్లపరాజు గారికి ఈ మాట జడ్జి గారి చేతిలో సైలెంట్‌ అంటూ బల్ల మీద చరిచే చెక్క సుత్తిలా తోచిందట. మరో పక్క బావ గారు చేసిన ఆలోచన నచ్చిన శ్రీరామమూర్తిగారు “మావయ్య చెప్పినట్లు అలా చేద్దాం రా. వెళ్లి విశాఖపట్నంలో లాయర్‌ చదువు చదివేసిరా” అని స్టీరింగ్‌ని విశాఖపట్నం వైపు తిప్పేశారని మల్లపురాజు గారు నాకు చెబితే నేను మీకు చెబుతున్నాను. ‘తండ్రి మాట జవదాటనిది రాముడే కాదుస్మీ, నేను కూడా’ అని ప్రపంచానికి చెప్పాలనిపించి మల్లపరాజు గారు విశాఖపట్నం వెళ్లి హాయిగా చదువుకున్నారు. లాయర్‌  పట్టా తీసుకుని సరాసరి అమలాపురం వచ్చి పెద్దనాన్న గారైన ప్రకాశం గారి దగ్గర జూనియర్‌గా చేరిపోయారు.ఇక్కడింకో విషయం చెప్పాలి. ఆంధ్రా యూనివర్శిటీలో విద్యార్థుల ఎన్నికలొస్తే మల్లపరాజుగారు బలపరిచిన ప్యానెల్‌ విజయం సాధించింది. దీనికి పునాది కూడా మన ఎస్‌కెబీఆర్‌ కాలేజీయే. ఎలాగంటారా… అమలాపురంలో చదువుతున్నప్పుడు  డిగ్రీ కాలేజీలో కూడా ఎన్నికలు వస్తే దాన్ని నడిపించి తన టీంని గెలిపించింది మల్లపరాజుగారే. ఈ రాజకీయమే ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనూ ఉపయోగపడింది. ఆ ఎన్నికల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యర్థిని ఓడించడంలో భాగంగా కాకినాడ విద్యార్థులు ఓటేయకూడదని మొదట రాజకీయ పావు కదిపారు. ఆ తర్వాత అది అలా అలా యూనివర్శిటీ అంతా పాకి లోలోపల ఓ ఉద్యమమైంది. అది కాస్తా మల్లపరాజు గారు మద్దతు పలికిన భాస్కర ప్రపాద్‌ అనే ఓ బుద్ధిమంతుడ్ని యూనివర్శిటీ అధ్యక్షుడ్ని చేసింది. ఇది అమలాపురం మార్కు రాజకీయం అన్నమాట. న్యాయవాద చదువు ముగిసింది. పట్టా వచ్చింది. ఇక బార్‌ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌మెంట్ మిగిలింది. కాని మల్లపరాజు గారి మనసంతా ఉద్యోగం మీదే ఉంది. ఇదంతా ఎప్పుడంటరా… 1964 సంవత్సరం  16వ తేదిన. లాయర్‌ కదా.. చట్టాలు గుర్తున్నట్లే ఈ తేదీలు గట్రా మల్లపరాజు గారికి గుర్తు. అయితే తండ్రి, పెదతండ్రి పట్టుదలతో ఓ మూడేళ్లు లాయర్‌గా చేద్దామని, ఈ వృత్తిలో నిలబడలేకపోతే అప్పుడు ఉద్యోగం చూసుకుందాం లెమ్మని ‘మమ’ అనుకుని ప్రకాశం గారి దగ్గర చేరారు. ఆ తర్వాత ఇంకేముంది ఐదున్నర దశాబ్దాల సక్సెస్‌ స్టోరీగా మిగిలారు మల్లపరాజు గారు. న్యాయవాదిగా తొలి కేసు వల్ల వచ్చిన రాబడి… అదే ఫీజు… ఓ ఐదు రూపాయలు. ఇంత తక్కువా అనకండి. ఆ రోజుల్లో ఐదు రూపాయలకి తులం బంగారం వచ్చేదని అమలాపురంలో ఓ బంగారం షాపాయన చెప్పారు. ఇంతకీ కేసేంటంటే ఓ ఆసామి అప్పు చేసి తీర్చడం లేదు. అతడ్ని కస్టడీలోకి తీసుకోవాలని వాదించాలి. మహానుభావుడు చనిపోయి ఎక్కడున్నారో రేమళ్ల రామచంద్రరావు గారే ఈ కేసు వాదించమని మల్లపరాజు గారిని ప్రోత్సహించారట. ఆ రేమళ్ల గారు గుమాస్తా కదా… అందుకని ఆయన వెనకుండి ధైర్యం చెప్పారని మల్లపరాజు గారే నాతో స్వయంగా అన్నారు. కేసు బెంచీ మీదకి వచ్చింది. “యువర్‌ ఆనర్‌” అంటూ ధైర్యంగా ఆర్గుమెంటూ చెప్పేశారు. జడ్జిగారు తీర్పు చెబుతూ “ఆ ముద్దాయిని అరెస్టు చేయండి” అన్నారు. అలా అంటూ మల్లపరాజు గారి వైపు “శభాష్‌… నీకు ఉజ్వల భవిష్యత్‌ ఉందంటూ” కళ్లతో ఆశీర్వదించారట.1973 సంవత్సరంలో ల్యాండ్‌  సీలింగ్‌ యాక్ట్ వచ్చింది, నిజానికి న్యాయవాదులను సమాజంలో గొప్పవారిగా చూపించింది ఆ చట్టమే. ఈ చట్టం రాగానే మల్లపరాజు గారు రైతుల పక్షాన అధమ పక్షం 500 డిక్లరేషన్లు ఇచ్చారట. ఇది ఆయనను అమలాపురంలో ఉన్న లాయర్లలో మూడో స్థానంలో ఉంచింది. మొదటి స్థానం పాలగుమ్మి సూర్యారావు గారిది, రెండో స్థానం సాధనాల వెంకట్రావు గారిది. వాళ్లతో పోలిస్తే మల్లపరాజు గారు పిన్న వయస్కులు అన్నమాట. కానీ సాధించింది మాత్రం కొండంత. ఈ మాటలు చెబుతూంటే మల్లపరాజు గారి కళ్ళు ఎందుకో భలే మెరిసాయి. ఆ మెరుపులో గర్వం కనిపించలేదు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. ఈ చట్టం పరిధిలోకి రాకుండా ఏకంగా పది వేల ఎకరాలు కాపాడారు మల్లపరాజు గారు. అంటే ఓ రెండు వేల మంది రైతులని అన్నమాట. ఫీజులు చెల్లించని వారి కేసులు వాదించి వారి ఆస్తులు వాళ్ల చేతిలో పెట్టించింది కూడా ఈ మల్లపరాజు గారే. ఇలా ఓ 50 – 60 కుటుంబాలకు చెందిన వారి వారసులు మల్లపరాజు గారిని చూడడానికి ఇప్పటికీ అమలాపురం వస్తూంటారు. ఇలా వస్తూ వస్తూ వాళ్ల పొలంలో పండిన కూరగాయలో, అరటికాయలో, కొబ్బరి బొండాలో ఇచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టి వెళ్లి పోతారు.అమలాపురంతో పాటు మరో నియోజకవర్గానికి కూడా ఉపయోగపడేలా కొంత మంది పెద్దలు ఓ బ్యాంకు పెట్టారు. అంటే ల్యాండ్‌ బ్యాంక్‌ అన్నమాట. దానికి అధ్యక్షుడిగా మల్లపరాజు గారే. ఎన్‌.టీ.రామారావు ముఖ్యమంత్రి అయ్యే వరకూ అది బాగానే ఉంది. ఆ తర్వాతే ఆ బ్యాంకుల్ని కో-ఆపరేటివ్‌ బ్యాంకుల్లో కలిపేయాలనే జీవో తెచ్చారు ఎన్టీఆర్‌. ఓ రెండు వందల మంది కార్లలోను, బస్సుల్లోనూ, రైళ్ళలోను హైదరాబాద్ వెళ్లి ముఖ్యమంత్రి అన్న ఎన్‌టీఆర్‌ని కలిసి… ఇలా కలిపేయకండి బాబూ అని అడిగారు. దానికి  ఎన్‌టీఆర్‌… మల్లపరాజు గారి భుజం మీద చెయ్యి వేసి “అలాగే బ్రదర్‌. మిమ్మల్ని ఇబ్బంది పెట్టం” అని హామీ ఇచ్చారు. రాజకీయులు కదా చెప్పినట్లే చెప్పి వెనుక నుంచి జీవో ఇచ్చేశారు. అప్పుడు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి అక్కడున్న నాబార్డు అధికారుల్ని, మంత్రుల్ని కలిసి “ఇది బాబు, ఇలా జరిగిందంటే” ఆ పెద్దలు జీవోని నిలిపేశాలా ఆర్డరు వేశారు. అలా ఆర్డర్‌ వేయించిన వాళ్లలో మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు గారు కూడా ఉన్నారట. ఇదీ మల్లపరాజు గారు చేసిన మంచి పనుల ఖాతాలో జమ అయ్యేదే.అమలాపురంలో రోటరీ క్లబ్‌ వచ్చింది… ఆనక అది వటుడింతై అని పెరిగింది మల్లపరాజు గారి హయాంలోనే. కూచిమంచి అగ్రహారం చివర్లో శంకరమఠం పక్కన ఉన్న స్థలాన్ని కొని అందులో కల్యాణ మండపం, పెళ్లికి హాలు, అతిథులకు రూంలు కట్టారు. ఆదీ మల్లపరాజు గారి ఖాతాలోనిదే. ఇంత చెప్పుకున్నాక కుటుంబం గురించి కూడా చెప్పుకోవాలి కదా. ఆయ్‌! అంచేత… మల్లపరాజు గారికి పెద్ద పెద్ద కళ్ళు ఇష్టం. అలాంటి కళ్ళుంటే మనకి భాగ్యం అనే నమ్మకం, ఇష్టం. అందుకే అంత పెద్ద కళ్ళున్న నామణిగారిని వివాహమాడారు. ఈ దంపతులకి ముగ్గురు సంతానం. తన వారసత్వ సంపదగా వచ్చిన ప్లీడరీగిరిని పెద్ద కుమారుడు శశికి అప్పగించారు. తండ్రిలాగే ఈ శశి కూడా పెద్ద లాయర్‌గా పేరు తెచ్చుకునే ప్రయత్నాన్ని అమలాపురం నుంచే చేస్తున్నాడు. ఇక రెండో అబ్బాయి కిష్టప్ప. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కుమార్తె బిందు. హైదరాబాద్‌లో భర్తా, పిల్లలతో ఉంటున్నారు. మల్లపరాజు గారు అజాత శత్రువేం కాదు. కోర్టులో చాలా మందే శత్రువులున్నారు. చిత్రంగా వాళ్లంతా కోర్టు బయట మాత్రం మంచి మిత్రులు. అందుకే… ఇందుకే కోర్టులో మల్లపరాజు పగబట్టిన శత్రువులా వాదిస్తారు. కోర్టు బయట చిన్ననాటి స్నేహితుడిలా కలిసిపోతారు. కొందరితో కాదు… అందరితోనూ…

Blog

CA హర గోపాల్ రామ్

ఈ హరగోపాల్‌ రామ్‌… ఎస్‌కేబీఆర్‌ ముఖద్వారం… ఇంతా చేసి ఇదంతా ఓ జడ్జి గారి అబ్బాయి గురించి. మరో నవతరం సంస్కృతం అధ్యాపకుడి తండ్రి గురించి. గోదారోళ్లం కదా… అందరినీ కలుపుకుంటాం కదా. వాళ్లు కూడా మనలో కలిసిపోతారు కదా. ఇప్పటి ఈ పెద్దాయన కూడా ఆ ఉడుకుడుకు యవ్వనంలో అలా గోదారోళ్లతో కలిసిపోయిన ఓ కుర్రాడు. జడ్జీలకి న్యాయం, ధర్మం ఉంటుంది కాని ఏలికలకు ఉండదు గాక ఉండదు. అందుకుని ఆ ఏలిన వారు అప్పుడెప్పుడో ఏం చేసారంటే ఈ జడ్జి గారిని అమలాపురం బదిలీ చేశారు. ఆ జడ్జి గారు తన సామనులతో పాటు సంసారాన్ని కూడా కోనసీమకు తీసుకొచ్చేశారు. నిజానికి ఆ న్యాయమూర్తే గారే కాదు. ఎవ్వరైనా అలా చేయాల్సిందే. అలా పట్టణ ప్రవేశం చేసినాయనే డీ.వీ.ఎస్. హరగోపాల్‌ రామ్‌. ఈ హరుడు, గోపాలుడు సరే చివరాఖర్న ఆ రామ్‌ ఎందుకు అనే అనుమానం వస్తుంది. రావాలి కూడా. ఎందుకంటే కోనసీమోళ్లం కదా. అలా అనుమానించేది మనమే కదా. అందుకే చెబుతున్నాను ఈ రామ్‌ గురించి. ఈ హరగోపాల్‌ గారి తాత గారు… రాఘవయ్య గారు, తన ప్రాణార్పణతో మనకి సొంత రాష్ట్రం సిద్ధించేలా చేసిన పొట్టి శ్రీరాములుగారు మంచి స్నేహితులట. ఈ “ట” ఎందుకంటే ఈ మాట హరగోపాల్‌ గారే చెప్పారు నాకు. ఆయన చెప్పే వరకూ మనకి తెల్దు కాబట్టి అన్నమాట. అన్నమాట కాదు… పది వేల ఎనిమిది వందల రూపాయలు విలువ చేసే శ్యామ్‌సంగ్‌ వారి సెల్‌ఫోనులో విన్నమాట. సరే, ఆ పెద్దలిద్దరు మంచి స్నేహితులు కదా… అందుకని ఆయన గుర్తుగా హరగోపాల్‌ గారికి రామ్‌ అనే పేరు కూడా పెట్టారన్న మాట. దీని వలన చేత ఏమర్థౌ అయ్యిందంటే హరగోపాల్‌ రామ్‌ గారి కుటుంబమంతా స్నేహానికి విలువే కాదు… పేరు, ప్రేమ ఇచ్చేంత గొప్పవాళ్లని చెప్పేందుకే.అలా అమలాపురం వచ్చేసిన హరగోపాల్‌ రామ్‌ గారు అటు సబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి, ఇటు గడియారస్ధంబాలకి సరిగ్గా మధ్యలో ఉండే జిల్లా పరిషత్‌ పాఠశాలలో పదో తరగతిలో చేరారు. అక్కడ తొలిసారిగా పాస్‌పోర్టు ఫొటో తీయించుకుని పెద్ద పరీక్ష రాసి ప్యాసయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే బోడసకుర్రు, కొమరగిరిపట్నం వెళ్లే దారి మధ్యలో సరస్వతి కొలువై ఉంటుంది. అదే ఎస్‌కేబీఆర్‌ కళాశాల. అదిగో అక్కడే ఇంటర్మీడియట్‌లో చేరారు. ఇప్పుడే ఫోన్‌లో చకచకా మాట్లాడేసిన ఈ హరగోపాల్‌ రామ్‌ గారు ఆ యొక్క చిన్నతనంలో మరీ చురుకుగా ఉండే వారని నాకు తెలిసొచ్చింది. ఎంత చురుకంటే ఆ ఎలక్యూషన్‌, డిబేట్‌ల్లో పాల్గొని ఫస్ట్‌ ప్రైజ్‌లు కొట్టేసే వారు. అలాంటి సమయాన, ఆ అద్భుత ఘడియల్లో ఓ పాలి కాలేజిలో “NEWS PAPERS AND THIER ROLE“అనే అంశంపై పోటీ పెడితే హా…శ్చర్యంగా ఫస్ట్‌ ప్రైజ్‌ కొట్టేశారు. లవకుశ సినిమాలో సీతమ్మ అంజలీదేవిని అన్న ఎన్‌టీఆర్‌ అడవులకు పంపేస్తుండగా… కాంతారావు ఎక్స్‌ప్రేషన్‌ లేని మోముతో గుర్రబండి నడుపుతూండగా వస్తుంది చూడండి ఓ పాట… ఏ నిమిషానికి ఏమి జరుగునో అని.. అయితే అది చూసి ఏడుపొస్తుందనుకోండి. కానీ ఈ హరగోపాల్‌ గారికి మాత్రం ఆనందాన్నిచ్చింది. ఆ పాటలో అన్నట్లు ఆ నిమిషానికి ఏం జరిగిందంటే ఎకనామిక్స్ లెక్చరర్‌ కేకేఎమ్‌ గారు అదే… కాశీభట్ల కృష్ణమూర్తి గారు కనిపించారు. వెంటనే ఈ రామ్‌గారిని దగ్గరికి తీసుకుని “వురేయ్‌ అబ్బాయి హరగోపాల రామూ… నీలో విషయం ఉందిరా. నాకు నచ్చావు. ఎంత నచ్చావంటే నీకు నేను నేర్చుకున్నదంతే చెప్పేయాలన్నంత నచ్చావు” అన్నారు. అనడమే కాదు… చెప్పేశారు కూడా. అలా కేకేఎమ్‌ గారి కుడిచేయి హరగోపాల్‌రామ్‌ గారి భుజం మీద పడగానే ‘వటుడింతై’ అంటారు చూడండి అలా ఎదిగిపోయారు.అంటే అన్నావంటారు కాని… ఏ చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయినా ఆర్టికల్స్ పూర్తి చేయకుండా చార్టెడ్‌ అకౌంట్ చదువు పూర్తి చేస్తారండి…!? నాకు తెలిసి ఇసాకపట్నంలో ఉండేటటువంటి బ్రహ్మయ్య అండ్‌ కంపెనీలో వారు కూడా అలా చేసి ఉండకపోవచ్చు. కానీ మోస్ట్‌ ఒబీడియంట్‌ స్టూడెంట్‌ అయిన హర గోపాల్‌ రామ్‌ గారు అలా ఆర్టికల్స్ కాకుండానే సీఏ చదివేశారు. అలా చదివేసి ఆనక వైశ్యా బ్యాంక్‌లో ఉన్నతోద్యోగంలో చేరారు. అక్కడ అంచలంచెలుగా ఎదిగారు. అక్కడి నుంచి వచ్చేసి చాలా కంపెనీల్లో డైరక్టర్‌గానూ, సీఈవోగానూ కూడా ఉద్యోగించారు. ఇలాంటి అద్భుత వేళల్లో… ఆనంద సమయంలో ఓ విశేషం జరిగిందట. ఇదియునూ సెల్‌ఫోన్‌లోనే విన్నదని ఇందుమూలంగా తెలియజేయడమైనది. అది ఏమిటంటే… ఓ కుర్రాడు ఇంజనీరింగ్‌ చదివాడు. వాళ్ల నాన్నగారు వ్యాపారవేత్త. మన హరగోపాల్‌ రామ్‌ గారి స్నేహితుడు. ఆ వ్యాపారవేత్త కుమారుడ్ని ఈ హరగోపాల్‌ గారి చేతిలో పెట్టి ”వీడ్ని మీరే తీర్చిదిద్దాలి” అన్నారు. ఆ కుర్రాడికి ఓ పాతిక లక్షలు లోన్‌ ఇప్పించి, ఆనక మరో మూడు కోట్లు రుణం వరకూ దాన్ని పెంచింది అక్షరాల ఈ హరగోపాల్‌ రామ్‌ గారే. బెంగళూరు సిటీ మధ్యలో ఆ కుర్రాడికి ఉన్న ఖాళీ స్థలంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వెలిసి ఆ కుర్రాడికి నెలకు ఐదారు కోట్లు అద్దె రూపంలో రావడానికి ఈ సీఈవో హరగోపాల్‌ రామ్‌ గారి చలువే అని ఆ కుర్రాడు కనిపించిన వారందరికీ చెబుతాడని కర్ణాకర్నిగా తెలిసింది. ప్రస్తుతం బెంగుళూరులే ఉంటున్న ఈ హరగోపాల్‌ రామ్‌ గారికి కుమారుడు ముందే చెప్పాను కదా… సంస్కృతం అధ్యాపకుడు. కుమార్తె, అల్లుడు అమెరికాలో నాకు నోరు తిరగని కంపెనీ, ఊరులో ఉంటున్నారు. ఏంటో ఇదంతా రాసేసరికి నాకు మన అమలాపురం వారి గురించి రాస్తుంటేనూ, వింటూంటేనూ తెలియకుండానే గుండెలు ఉప్పొంగుతున్నాయి. ఇలా ఉప్పొంగడాన్ని జబ్బు అనరని, మహదానందం అంటారని కొందరు డాక్టర్లు చెబితే తెలిసింది. ఈ వారం మంచి ముత్యానికి నమస్కరిస్తూ…

Blog

ఎర్రమిల్లి రోహిణీ కుమార్ ​

( అభిరుచిని గౌరవిస్తే … జీవన సాఫల్యం )​ పుట్టిన పది నెలలకి పాల బువ్వ రుచి చూపిస్తారు. అదే అన్నప్రాసన. ఆ వేడుకలో చుట్టూ పెన్ను, పుస్తకం, డబ్బు దస్కం పెట్టి బాబు దేనిని ఎంచుకుంటాడో అని ఆత్రుతగా ఎదురు చూస్తారు. మనవాడు ఏది పట్టుకున్నాడో తెలీదు కాని పదో ఏట  నుంచీ చిత్ర లేఖనం మీద మక్కువ పెంచుకున్నాడు.చాలామంది పిల్లలు తల్లితండ్రులు సూచించిన బాటలో సాగిపోతారు. బహు తక్కువ మంది పోరాడి, ఒప్పించి తమదైన జీవితం ఎంచు కుంటారు. రోహిణీ కుమార్ ఆ కోవకిచెందుతాడు. School days లో ఇతగాడి చేత తమ note books మొదటి పేజీలో గణపతి బొమ్మ వేయించుకుందుకు సహాధ్యాయులంతా వరుస కట్టేవారు. టీచర్ల క్యారికేచర్ లు వేసి వారిని మెప్పించే వాడు .రోహిణీ కుమార్ మన కాలేజీ లో PUC (1963-64  Bi P )చదివాడు. పరీక్షలో ఇతడు రాసిన ఆన్సర్ ల ని బయాలజీ బొమ్మలు dominate చేసి మంచి మార్కులు తెచ్చిపెట్టేవి ( ఇడ్లీ కంటే చట్నీ బావుండినట్లు ) PUC అవగానే తనని శాంతినికేతన్ లో చేర్పించమని చేసిన ఒకరోజు నిరాహార దీక్షను తండ్రి గారు పట్టించుకోక … వరంగల్ పంపి   ఆయుర్వేదం లో చేర్పించారు . అక్కడ వారాంతాల్లో ఓరుగల్లు కోటలోని శిల్పాకృతులు స్కెచ్ లు వేస్తూ తనలోని ఆర్టిస్ట్ ని బతికించు కున్నాడు. సెలవులకి అమలాపురం వచ్చినప్పుడు మునిసిపల్ స్కూల్ డ్రాయింగ్ టీచర్ పేరి సుబ్బారావు గారి శిష్యరికం కొనసాగించేవాడు . పేరి సుబ్బారావుగారు much more than a drawing teacher. అయన artist. బహుముఖ ప్రజ్ఞాశాలి. Stage performer and humourist. అంటాడు రోహిణి కుమార్!. ఆయుర్వేదం రెండో ఏడాదిలో మాధవరావు గారి పరిచయం కలిగింది. మాధవ రావు గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి . విజయనగరం లో పైడి రాజు గారి ఆర్ట్ స్కూల్ లో చదువుకున్నారు . వారి సాహచర్యం లో అనేక  Art forms గురించి తెలుసుకున్నారు . శాంతినికేతన్ లాంటి ఆర్ట్ schools వివరాలను తెలుసుకున్నాడు . రోహిణీ కుమార్  జీవితం ఒక పెద్ద మలుపు తిరగడానికి మాధవ రావు గారి  శిష్యరికం కారణం అయ్యింది ఆ వేసంగిలో మాధవరావు గారితో కలిసి రామప్ప గుడికి Art camp కి  వెళ్లడం…  తన జీవిత గమ్యం గురించిన స్థిరమైన నిర్ణయం తీసుకోవడం… వరంగల్ వచ్చి రూమ్ ఖాళీ చేసి అమలాపురం వచ్చేయడం టకటకా జరిగిపోయాయి. తండ్రి రెండవ ప్రపంచ యుద్ధపు రిటైర్డ్  Captain … Dr. E. B. Sankaram… Gun తీస్తాడని తెలిసినా భయపడలేదు. నిరసనలు , వాగ్వాదాలతో ఒక సంవత్సరం గడిచాక …రాజీ కుదిరింది. ఒప్పందం ప్రకారం రోహిణీ కుమార్ బ్రతుకు తెరువుకి పనికొచ్చే commercial art చదవాలి. మాధవరావు గారి సలహా మేరకి College of Fine Arts, Madras లో చేరాడు. మద్రాసు వాతావరణం పడక ఆ తర్వాతి సంవత్సరం నుంచీ హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ కి  మారాడు . అదే సమయంలో మాధవరావు గారికి వరంగల్ నుంచి హైదరాబాద్ కు బదిలీ అయింది. కాలేజ్ లో తన ఆప్షనల్  కమర్షియల్ ఆర్ట్ … అయినా మాధవరావు గారి సాహచర్యంలో ఎక్కువ సమయం పెయింటింగ్ లోనే గడిచేది. Fine Arts  కాలేజీ అనుభవాలు   study tours మరచిపోలేనివి . ఆ సందర్భాలలో వందల సంఖ్యలో sketch లకి డజన్లకొద్దీ landscape లకి చక్కటి అవకాశం దొరికి తన లోని ఆర్టిస్ట్ కి మెరుగులు దిద్దు కున్నాడు . రోజూ ప్రత్యేకమైనదే… రోజుకో కొత్త అనుభవం…మచ్చుకి ఒకటి… కాశ్మీర్… మంచు పర్వతాల మధ్య, గడ్డకట్టే చలిలో landscape చేయడం మర్చిపోలేనిది. అది INDO PAK boarder, రోహిణీ కుమార్ గురువుగారు కొండపల్లి శేషగిరిరావు గారు lanscape చేస్తుండగా BSF జవానులు వారిని రెండు మూడు గంటలపాటు నిర్భంధించి ఆ తర్వాత వదిలారట!. మాధవరావు గారి ప్రేరణ వల్ల 1971 వేసవిలో విజయనగరం వెళ్లి  పైడిరాజు గారి వద్ద life study కోసం Intensive  training camp కి వెళ్లారు . పైడిరాజుగారు ఒక Legendary Artist .   రోహిణి కుమార్ ని ఎంతో ప్రభావితం చేశారు .Fine Arts college లో పట్టా పుచ్చుకుని, కొన్నేళ్ల freelance అనుభవంతో తన స్వంత design studio తో నాంది పలికి, పదేళ్ల తర్వాత GDC creative Advertising పేరున హైదరాబాద్ లో  Art combined with business మొదలు పెట్టాడు.ఉపాధి కోసం  పట్టణాలకు వెళ్ళినవారు రిటైర్మెంట్ ప్రకటించు కొని  గ్రామాలకు తిరిగి రావడం  అరుదుగా  జరుగుతుంది .అలా కొన్నేళ్ల తరువాత  2008 లో తాను పుట్టిన మట్టి వాసన వెతుక్కుంటూ కోనసీమ కి తిరిగి వచ్చాడు. శ్రీ శ్రీ అన్నట్లు .. కవిత్వమొక తీరని దాహంArt కూడా అంతే అంటాడు.తానింకా artist in the making అనే చెప్తాడు.అది రోహిణీ కుమార్ simplicity ! 

Blog

గొట్టుముక్కల భాస్కర్(RSS ప్రచారక్ ప్రముఖ్)

విశాల భారత దేశం కొన్ని సమయాల్లో గణ రాజ్యాలుగా పరిపాలించబడింది . అనేక భాషలు , తెగలతో కూడిన ఈ భౌగోళిక భాగం ఒకే ఆత్మ కలిగి భారత జాతిగా మనుగడ సాగించింది అంటే … పాచ్యత్య చరిత్ర కారులకు నమ్మడానికి కష్టమైంది.! చిన్ని, చిన్ని రాజ్యాలను ఏక ఖండంగా చేసిన ఘనత మాదే అని బ్రిటిష్ చెప్పుకున్న గొప్పల డొల్లతనం బయటపడి ఇప్పుడు మన దేశానికే ఒక ఆవిచ్చిన్న సంస్కృతి కలిగిన అతి పురాతన దేశంగా ప్రపంచం గుర్తిస్తోం ది ! దీని పేరే సనాతన ధర్మం !ప్రజలలో అంతర్లీనంగా ఉన్న ఈ భావనకు వంద సంవత్సరాలుగా రాష్ట్రీ య స్వయంసేవక్ సంఘ్ వ్యక్తీకరించిన రూపంగా మన ముందు నిలిపింది !దేశభక్తి, క్రమశిక్షణలతో కూడిన పౌర సమాజ నిర్మాణానికి RSS కృషి చేస్తోం ది . అటువంటి ఆదర్శానికి అంకితమైన ఒక కుటుంబం నుంచి మన గొట్టుముక్కల భాస్కర్ వచ్చారు. గొట్టుముక్కల భాస్కర్ మన కాలేజీ లో ఇంటర్మీడియట్ ( MPC -1970-72) చదివారు .RSS కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు . కానీ చదువుని ఎప్పడు నిర్లక్ష్యం చేయలేదు . ఇంటర్ పాస్ అయ్యాక degree ఎక్కడ చదవాలి (?) మరొక ఊరు వెళ్లి RSS విస్తరణ కోసం పని చేస్తూ చదువుకోవాలని ఆయన కోరిక! పెద్ద రాద్ధాంతం లేకుండా తల్లి- తండ్రులూఅనుమతించారు. భాస్కర్ జీవితం లో ఒక నూతన అధ్యాయం మొదలయ్యింది.రామచంద్రపురం వెళ్లి కాలేజ్ లో చేరినప్పుడు అక్కడ RSS కు 2 శాఖలు ఉండేవి.మూడు సం|| ల భాస్కర్ కృషి ఫలితంగా మరో మూడు శాఖలు ఏర్పడి అవి 5 అయ్యాయి . సాయంకాలం ఒక గంటపాటు కలిసి కార్యక్రమాలు చేయడం కాకుండా స్వయం సేవకులతో సాన్నిహిత్యం పెంచుకొని వారి వ్యక్తిత్వంలో మార్పు తీసుకు రావాలన్నది భాస్కర్ విధానం !సైకిల్ యాత్రలు , కార్తీక పౌర్ణమి సంబరాలు నిర్వహించి తన తోటి విద్యార్థులకు చేరువ అయ్యారు . వాదనతో కాకుండా ప్రవర్తనతో వారి పరిణతికి కృషి చేశారు . భాస్కర్ ప్రభావంతో ఇద్దరు RSS కోసం జీవిత కాలం పని చేయ నిశ్చయించారు. డిగ్రీ పూర్తయ్యేటప్పటికీ దేశం లో ఎమర్జెన్సీ గొడవ మొదలయ్యింది . ఇది ధర్మానికి సంబంధించిన అంశం కాదు . RSS ను ఒక మత సంస్థగా అభివర్ణిం చే వారికి సమాధానం ఇస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించి జైళ్ళకు వెళ్లి భాస్కర్ లాంటి స్వయం సేవకులు దేశభక్తి గల ఉత్తమ పౌరులుగా తమను తాము నిరూపించుకున్నారు . చదువు పూర్తి అయ్యాక భాస్కర్ పూర్తి సమయం ప్రచారక్ గా మారాలని తలచారు దీనికి కుటుంబ అనుమతి ఎలా పొందాలి(?)ముఖ్యంగా తన తల్లి స్పందన ఎలా ఉండొచ్చు (?) ఎలా ఒప్పించాలి (?) ఎన్నో ప్రశ్నలు ! ఊహించినట్లే తల్లి సంసారంజీవితం లో ఉండి కూడా దేశ సేవ చెయ్యవచ్చు అంటూ తనకు తెలిసిన గొప్ప వ్యక్తులను ఉదహరించారు. మొత్తానికి ఆమెను మిగతా కుటుంబ సభ్యులను ఒప్పించి పూర్తి కాల స్వయంసేవక్ గా భాస్కర్ జీవితం ప్రారంభించారు . కుటుంబానికి దూరంగా RSS కోసం జీవితాన్ని అంకితం చేశారు . ఆ జీవిత గమనం లో ఎన్నో గొప్ప అనుభవాలను పొందారు . మారు మూల పల్లెలకు వెళ్లి పనిచేశారు . వివిధ స్టాయిలకు చెందిన కుటుంబాలతో ముచ్చటించారు . తెలంగాణలో పని చేసినపుడు రజాకార్ల వలన నిమ్న వర్గాలు ఎన్ని కష్టాలను అనుభవించాయో తెలుసుకున్నారు . స్వామి రామానంద తీర్థ వారిని ఎలా సంఘటితపరచారో గ్రహించారు. ఒక సమస్య వచ్చినపుడు సమాధానాల కోసం వెతకడం కాకుండ జాతిని దృఢ పరచి విపత్తులను సంఘటితంగా ఎదుర్కొని పోరాడటానికి సంసిద్ధం చేయాలనే RSS వ్యవస్థాపకుల భావన సరైనదే అంటారు బాస్కర్.! సింగపూర్ , ఇజ్రాయెల్ దేశాలు తమ పౌరులకు మిలటరీ శిక్షణనిస్తే, కీర్తించే మనం, స్వయం సేవకులకు RSS కనీస శిక్షణ గరిపి దేశభక్తి నిండిన ,ఉత్తమ పౌరులుగా నిలబెడదామంటే…వారిని అనుమానంగా చూస్తాం . ఇది ఒక colonial mindset ! 75 సం ల తరువాత ఇప్పుడే కొంత మార్పు కనబడుతుంది. గొట్టుముక్కల భాస్కర్ లాంటి వారి కృషి వృధా పోదు. ప్రస్తుతం గొట్టుముక్కల భాస్కర్ ఆంధ్రా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రా లకు “ప్రచారక్ ప్రముఖ్ “ గా వ్యవహరిస్తున్నారు.|| జై హింద్ ! ||

Blog

పోడూరి వెంకట రమణ శర్మ(అధ్యాపకత్వం నుంచి అద్వైత సిద్ధికి …)

SKBRC పెట్టిన 20 సం ల తరువాత కొత్త తరం లెక్చరర్స్ విధుల్లోకి వచ్చారు.వాళ్ళలో కొంతమంది అక్కడే చదివినవారు .. వారిలో మన ఈనాటి ఆణిముత్యం పోడూరీ వెంకట రమణ శర్మ ఒకరు !అదే సమయం లో విద్యా విధానం లో వచ్చిన మార్పులు తరగతి గదులను నూనూగు మీసాల నవ యువకులతో నింపింది . Curriculum లో కూడా మార్పులు చేశారు. Shakespeare, Milton లను చదివే బాధ తప్పింది . ఈ మార్పులు యువతరం లెక్చరర్స్ లో సంతోషం నింపి విద్యార్థులకు చేరువ చేసింది .పోడూరి రమణ శర్మ గారు మన కాలేజ్ లో PUC, B Com చదివారు . వారి బి కాం class లో 16మంది ఉండేవారు . వారిలో చాలా మంది M Com కోసం AU కి వెళ్లారు . 1968 లో M.Com తరువాత రమణ శర్మ మన కాలేజ్ లో లెక్చరర్ గా చేరారుతన టీచింగ్ skills ను నిరూపించుకొని బాగా చెపుతారు అనిపించుకోవడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టలేదు దానికి సాక్ష్యం….ఇంటిముందు తెల్లవారు ఝాము నుంచి కాలేజ్ కి వెళ్లేంత వరకు-తిరిగి సాయంత్రం 8 గం ల వరకు నిలిచి ఉండే tuition విద్యార్థుల సైకిళ్లే!Comfort zone లో ఉన్న వారు తమ వృత్తి మార్గాన్ని మార్చుకోవడం అరుదుగా జరుగుతుంది !పుట్టి పెరిగిన ఊరిలో , తాను చదువుకున్న కాలేజ్ లో లెక్చరర్ ఉద్యోగం ! సమాజం లో, విద్యార్థుల మధ్య మంచి పేరు ప్రఖ్యాతులు . ట్యూషన్ ల కోసం queue కట్టిన విద్యార్థులు.ఇవేవీ రమణ శర్మ గారిని మరో కొత్త వృత్తి వైపు చూడకుండా చేయలేక పోయాయి .దశాబ్దం పాటు కాలేజ్ లెక్చరర్ గా పని చేశాక .రమణ శర్మ గారి దృష్టి corporate ప్రపంచం వైపు మళ్లింది . కంపెనీ సెక్రటరీ కోర్స్ చేయడం మొదలు పెట్టారు 1980 నాటికి ఆయన కోనసీమ నుంచి వచ్చిన మొదటి కొంతమంది ACSలలో ఒకరిగా నిలిచారు.Class రూమ్ నుంచి కార్పొరేట్ ప్రపంచం లోకి ప్రయాణం అలా మొదలైంది .25 సం ల పాటు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో CS గా జనరల్ మేనేజర్ గా, financial adviser గా ఇండియా లోను ఇతర దేశాలలోను పని చేశారు . ఆయనకు అది ఒక కొత్త ప్రపంచం . ప్రతి పనిని సమయసీమలో పూర్తిచేయాల్సిన ఒత్తిడిలనుతట్టుకొంటూ అందరి మన్ననలను పొందారు . దీ ని తో రమణ శ ర్మ ఎలాంటి పరి స్థితులలోనైన తాను ఇమిడిపోగలరని నిరూపించుకున్నారు .పదవీ విరమణకు దగ్గరవుతున్నప్పుడు రమణ శర్మ గారి మనసులో కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి . అవి భౌతిక ప్రపంచానికి చెందినవి కావు ! సమాధానాల కోసం వెతుకులాట మొదలైంది .చిన్నప్పటి నుంచి అంతర్గతం గా ఆయనకి ఒక నమ్మకం- ఏ మనిషి లోను వ్యక్తి అనేవాడు ప్రత్యేకంగా లేడు అని,అందరి ప్రవర్తన, గడియారం లో మూడు ముల్లులకి , వాటి వెనకాల ఉన్న యాంత్రిక శక్తి ఎలా ఆధారమో,మనుషులు అందరినీ నడిపించే శక్తి ఒకటే అన్నది రమేష్ బల్శేకర్ వంటి జ్ఞానులను కలిసి దృవ పరచుకున్నారు. 91 లో కంపెనీ సెక్రటరీ ల లోకల్ చాప్టర్ చైర్మన్ అయిన తరువాత, ఆయనకి ఒక ఆలోచన స్పురించింది.ధనం, పేరు ప్రఖ్యాతులు వంటి వాటి వెనక పరిగెడితే, శాశ్వత ఆనందం దొరకదు అని గ్రహించి, ఆధ్యాత్మికం గా స్వరూపం గుర్తింపు కోసం ప్రయాణం సాగించారు 1991 లో రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్లడం తో ప్రారంభం అయి, అయన మార్గం లో ఇరవై ఏళ్ళ సాధన తరువాత , ఎల్లి రూజ్ దార్ వంటి జ్ఞానుల సహాయం తో, పరోక్ష జ్ఞానాన్ని , అనుభవ జ్ఞానం గా మార్చుకోవడం, ఒక గొప్ప అదృష్టం.. గురువుల సహాయం తో గ్రహించినది, ఉపనిషత్తుల సారం తో పోల్చుకోవడం జరిగి, అందుకున్న అవగాహన ఊహ కాదని ధృవీకరించు కున్న తరవాత, మార్గం లో ఉన్న సాధకులకు ఉపయోగపడేలా,అరుణాచలం పిలుపు కథలు, అన్వేషణ , A Search In Vedic India ( notionpress.com/amazon} వంటిరచనలు చేశారు. ఆసక్తి ఉన్న వారు వారి ఈ రచనలనుwww.youtube.com/@rpodury (playlist) లో ఆడియోలో వినవచ్చు. అన్వేషణ పుస్తకం కావలిసిన వారు, ఆయనకి ఫోన్ చేసి పొందవచ్చు అయన రచించిన వంద కధల దాకా ప్రతిలిపి (ఇ మ్యాగజైన్ )లోను, గో తెలుగు లోను ఏడు లక్షలు కు పైగా పాఠకులు చదివి కొన్ని వేల మంది అనుసరించడం జరిగింది. పంజరం, మూగ ప్రేమ, అరుణాచలం పిలుపు కధలు అనే పేరు తో మూడు పుస్తకాలుగా ప్రచురణ, అన్వేషణ పుస్తకాన్ని ప్రచురించడానికి ముందు జరిగింది. శర్మ గారిని కొన్ని ఛానెల్స్ వారు ఇంటర్వ్యూ చేసి సందేహాలకు పొందిన జవాబులు కింద లింకులలో వినవచ్చు అద్వైతం మీద శర్మ గారి ఇంటర్వ్యూలు._The Secret of Spirituality_https://www.youtube.com/watch?v=JcHdsT7Rq4k _The path to infinite knowledge._https://www.youtube.com/watch?v=jeLzJBRp_Ek _On Advaitha_https://youtu.be/SKvoGUHG0Cc?si=TJCm52IP5M_sbw1A _On Mukthi_https://youtu.be/gqIMFlch9JM?si=5xXJuQauBdyPB_Uj _On peace of mind._https://youtu.be/m7K9ZhHIhes?si=BJ-5QuMnRgWpTebz

Blog

USN MurthyDirector , NIPER- Guwahati

1975 సంగతి ఇది ! కాలేజ్ లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ప్రిన్సిపాల్ రామేశం గారి ముందు ఒక విద్యార్థి తన అడ్మిషన్ కోసం నిలబడ్డాడు . అతన్ని పరికించి చూస్తూ రామేశం గారు  కొంచెం వాచ్ చేయ వలసినవాడీ   అన్నారు . బదులుగా ఆ విద్యార్థి  అలాగే సార్ అని నిలబడ్డాడట . కొంచెం కాదు వీణ్ణి  చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి అన్నారట పక్కనున్న  ఫాకల్టీ మెంబరుతో … ఆ విద్యార్థి  ఈనాటి మన కథానాయకుడు USN Murthy . క్లాస్ లో తెలివైన విద్యార్థులలో ఒకడిగా పోటీ పడుతూ చదివే వాడు . కొంచెం కొంటెతనంతో నవ్వుతూ తుళ్లుతూ క్లాస్ ను హుషారుగా ఉంచేవాడు . ఎప్పుడైనా మూర్తి కాలేజ్ కి రాకపోతే ఆ రోజు క్లాస్ చిన్నబోయేది ! ఈనాడు వార్త పత్రికలో వారాంతంలో “ చదువు” అనే శీర్షిక వచ్చేది .  కొత్త కొత్త కోర్సుల వివరాలతో  విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఆ శీర్షికను సుమారు మూడు దశాబ్దాల పాటు నడిచింది. ఆ శీర్షికను నిర్వహించిన వ్యక్తి  ప్రిన్సిపాల్ గారి scanner లో ఉంచాలి అన్న విద్యార్థి ఒకడే ! అతను ఇలాంటి ఘన కార్యాలు ఇంకెన్ని సాధించాడో  చూద్దాం రండి.। USN మూర్తి మన కాలేజ్ లో  BSc (1978 ) AU నుంచి ఎంఎస్సీ ( 1980)  OU నుంచి Doctorate పట్టాలను పొందారు .ఏయూ లోని వారి సహ విద్యార్థులు  చాలామంది బ్యాంకు , టీచింగ్ ఉద్యోగాలకు వెళ్లారు. USN మూర్తి తనకు ప్రీతిపాత్రమైన పరిశోధనల వైపు వెళ్లారు. పాండిచ్చేరి లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహణ లో పనిచేసే vector control Lab లో తన పరిశోధనలు మొదలుపెట్టారు .  మలేరియా వ్యాధి మోడలింగ్ , Integrated  control మీద పరిశోధనలు చేశారు. ఆయన దృష్టి పట్టు పరిశ్రమ మీద పడి దిగుబడి పెంచే మార్గం చూపిస్తే రైతుల ఆర్థిక కష్టాలు తీర్చవచ్చని దేశ దిగుమతుల ఖర్చు తగ్గించవచ్చని భావించి మైసూర్ లోని పరిశోధన శాల లో పని మొదలు పెట్టారు . అక్కడినుంచి హైదరాబాద్ లోని Regional Research Labs లో సైంటిస్ట్- B గా చేరి  అనతికాలం లోనే chief scientist గా , Biology Division హెడ్ –  గా ఎదిగారు . ఖ్యాతిగాంచిన NIPER గౌహతి కి వ్యవస్థాపక డైరెక్టర్ మన  USN Murthy !  అక్కడ పరిశోధకుడు మూర్తి ఆచార్యుడిగా , ద్రష్టగా  పరిణితి చెందారు. పరిశోధనల కోసం Super computers ( PARAM, EMBRYO) ను సాధించి తెచ్చారు.. అతని గైడెన్స్ లో  15 మంది Research scholars  Ph D పట్టాలు పొందారు . NIPER  పరిశోధన ఫలితంగా తయారైన ఔషధాల technology ను పరిశ్రమలకు బదలాయించి వాటి commercialisation కు  తోడ్పడ్డారు . ముఖ్యంగా Covid సంక్షోభం సమయం లో ఇవి ప్రజలకు బాగా ఉపకరించాయి. Prof. USN Murthy పొందిన గౌరవాలు, సత్కారాలు గురించి రాయాలంటే పేజీలు సరిపోవు కొన్ని ముఖ్యమైనవాటిని ప్రస్తావిస్తాను. .  visiting Professor at York University, Canada,    visiting Professor at central University, of Hyderabad, ప్రస్తుతం  Prof మూర్తి  NIPER గౌహతిలో  నీతి అయోగ్ నిధులతో నడిచే BIRAC Incubation Centre  ATAL Incubation center లకు చైర్మన్ గా వ్యవహిరుస్తున్నారు CSIR సలహా సంఘ సభ్యుడిగా , భారత జాతీయ పసుపు బోర్డు సభ్యుడిగా . పని చేశారు . Prof మూర్తి మన దేశంలోని 2 తప్ప అన్ని NIPER centre లలో డైరెక్టర్ గా పని చేశారు.ఎనిమిది దేశాలలోని ప్రఖ్యాత పరిశోధన శాలలను చుట్టి వచ్చారు . ఆనాటి మన కాలేజ్ ప్రిన్సిపాల్ జీపీ  రామేశం గారు ఏ ముహూర్తం లో అన్నారో గానీ మన Prof USN మూర్తి ఇప్పటికీ lime light లో ఉంటున్నాడు . మీరు మాకు గర్వ కారణం , Prof మూర్తి !

Blog

వారణాసి ఉదయ భాస్కర్ Former CMD Bharat Dynamics Ltd ( BDL)​

NCC training లో భాగంగా ఫైరింగ్ రేంజ్ ఒకటి మన కాలేజ్ లో ఉండేది. అక్కడ దీక్షగా ప్రాక్టీస్ చేస్తున్నాడు చూశారా అతనే మన ఉదయ భాస్కర్ . Bsc చదువుతున్నాడు .ఆ సమయంలో  అతన్ని flight సైన్స్ బాగా ఆకట్టుకుంది .ఈ అబ్బాయి భవిష్యత్తులో   మిస్సైల్ లను తయారు చేసే BDL లాంటి సంస్థ కు CMD అవుతాడని ఎవరు ఊహించి ఉండరు . అతను కూడా….. ఇంతకు ముందు ఆణిముత్యాల hero లు చెప్పినట్లు …. తన career లో సాధించిన విజయాలకు  కాలేజ్ faculty  ఒక ముఖ్య కారణం అంటారు ఉదయ్ భాస్కర్ 75 seats  మాత్రమే ఉండే  Harcourt Buttlar  Tech. Institute, ( కాన్పూర్) లో  ఎంట్రన్స్ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచి scholarships తో  సీట్ పొందారు. దానికి  మన కాలేజ్ లో పడిన  బలమైన పునాది దోహదం చేసింది అంటారు ఉదయ భాస్కర్ . HBTU లో  నేర్చిన అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ అతని  జీవితాన్ని మలుపు తిప్పింది .  M Tech (పాలిమర్ సైన్స్ )కోసం IIT DELHI లో చేరారు . IIT లో బోధన విద్యార్థుల critical thinking ను encourage   చేసే విధంగా వుంటుంది. అది మీకు తెలుసు.ఒకసారి క్లాస్ లో ప్రొఫెసర్ polymer లో అంతా వరకు లేని కొత్త అప్లికేషన్ గురిచి వ్రాయమన్నారు . ఏం రాయాలి (?) అని క్లాస్ అంతా తీవ్ర ఆలోచనలో మునిగి పోయింది. ఉదయ భాస్కర్ osmosis ప్రక్రియ ను చెప్పి అందరి మన్ననలు పొందాడు . BATA కంపెనీలో  intern గా పని చేస్తున్నప్పుడు ఒక రోజు  ప్రొడక్షన్ లైన్ లో polymer గట్టిపడి పోయి ఉత్పత్తి ఆగిపోయింది. దానిని క్లీన్ చేయడానికి ఎవరి తరం కాలేదు . ఆ బాధ్యత తీసుకొని కొన్ని గంటల  వ్యవధిలో సమస్యను పరిష్కరించి BATA యాజమాన్యం మన్నన పొందారు .  కొన్ని  సంవత్సరాలు Bakelite hylam ( Hyderabad ), Dytron India Limited ( Kolkata), వంటి సంస్థలలో వేరు, వేరు స్థాయిలలో పని చేసి 1990  నాటికి బీడీఎల్  లో  మేనేజర్  గా చేరారు . Flight sciences మీద ఉన్న passion తో  BDL లో   వేరు వేరు departments లో పని చేసి చాలినంత నైపుణ్యం సాధిస్తూ  ఏజీఎం , జీఎం ,Director (production) గాను  పదోన్నతులు పొంది చివరకు  2015 నాటికి   CMD గా నియామకం పొందారు.  BDL ఒక  భారత ప్రభుత్వరంగ సంస్థ !. 1970 నుంచి మనుగడలో ఉంది. దేశ సైనిక అవసరాల కోసం వివిధ మిసైల్స్ ను తయారు చేస్తుంది. ఈ వివరణ 2015 లో మన ఉదయ భాస్కర్ దానికి CMD గా వచ్చే వరకు సరిపోతుంది !   ఉదయ భాస్కర్ ఆధ్వర్యం లో 2015-19 మధ్య BDL ఆధునీకరణ, అనుబంధ సంస్థలకు శిక్షణ, తోడ్పాటు ద్వారా తమ సాలుసరి  ఉత్పత్తి విలువను ₹. 1700 కోట్లు  నుంచి ₹4600 కోట్లకు పెంచుకుంది . IPO ద్వారా ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించడం అనేది రక్షణ రంగం లోని సంస్థకు , ప్రైవేట్ రంగంలోని సంస్థలకు చాలా భేదం ఉంటుంది. దేశ భద్రత దృష్ట్యా BDL తమ ప్రాజెక్టు వివరాలను( Prospectus )పూర్తిగా వెల్లడించకుండా  పెట్టుబడి దారులను మెప్పించగలిగితేనే సఫలం అవుతుంది. అది ఒక సున్నితమైన అంశం. దానిని అధిగమించి IPO ను విజయవంతం చేయడం  ఉదయ భాస్కర్ పరిణతికి నిదర్శనం. అదే సమయంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతి విధానం రూపుదిద్దుకోవడంతో BDL కు , ఉదయ భాస్కర్ బృందానికి మరో  గొప్ప అవకాశం లభించింది. ఫలితాలను సాధించే క్రమంలో , ఉదయ భాస్కర్ ప్రవేశ పెట్టిన “ కాఫీ టేబుల్ బుక్ “ఆలోచన  BDL లోని వివిధ departments ల సమన్వయానికి ఉపయోగపడింది. ఉదయ్ భాస్కర్ learning curve పైపైకి సాగుతూనే ఉంది. CMD గా రక్షణ శాఖ కార్యదర్శితో , DRDO శాస్త్రవేత్తలతో రక్షణ మంత్రులతో  , ప్రధాన మంత్రితో సమావేశాలు  ఆయనకు నిత్యకృత్యంగా మారాయి. ఉదయ భాస్కర్ , ఆ మీటింగులను గుర్తు చేసుకుంటూ •••  మనం అనుకునే విధంగా వీరెవ్వరు  కులాసాజీవితం  గడపరు. రోజుకి 18 గం పని చేస్తారు ,అది కూడా చాలా focused గా ,అని తన అనుభవం గా చెప్పారు. చాలా మంది  వృత్తిసాధకుల లాగే ఉదయ భాస్కర్ కూడా “ Learn & contribute” సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. తన అనుభవసారాన్ని , IIM లు , IIT లు , అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ , IPE లకు వెళ్లి అక్కడ high profile ఆఫీసర్లతో  పంచుకుంటున్నారు !  UPSC  సెలక్షన్ బోర్డు సభ్యుడిగా  పనిచేశారు. central Vigilance commission (CVC)చేత నియమించబడి కొన్ని సంస్థలలో  Independent Extrrnal Monitor  గా పనిచేశారు. ప్రస్తుతం Ministry of Ayush  కోసం   పని చేస్తున్నారు.  నిరంతర విద్యార్ధి మన  ఉదయ భాస్కర్ కు అభినందనలు ! 

Blog

Prof. మునుకుట్ల రాధాకృష్ణ ( IIT Bombay)

దేశ ఆర్థిక పరిస్థితిని మార్చడానికి దోహద పరిచిన ముఖ్య అంశాలలో ఒకటి సముద్ర తీరాల ( offshore) నుంచి ముడి చమురు క్షేత్రాల అన్వేషణ , గుర్తింపు , ఉత్పత్తి!దీనికి ఆధారం గా నిలిచిన పరిశోధన గ్రం థం Basin Evolution and petroleum Prospectivity of the Continental Margins of India ఈ గ్రంథకర్తలలో ఒకరు మన మునుకుట్ల రాధాకృష్ణ !  ఈ పుస్తకం ప్రపంచ ఖ్యాతి గడించింది .ఇది ఒక reference పుస్తకం !మునుకుట్ల రాధాకృష్ణకు చిన్నతనం నుంచి తెలివైన వాడిగా పేరు ఉండేది SKBRC లో చేరాక Physics Lecturer ASR గారి దృష్టి మన మునుకుట్ల రాధాకృష్ణ మీద పడింది .ఆయన విద్యార్ధులలో నిబిడికృతమైన ప్రజ్ఞా పాటవాలను బయటకు తీయడం లో దిట్ట కదా ! ఆ గురు-శిష్యుల బంధం దేశానికే ఒక అద్భుతమైన శాస్త్రవేత్తను ఇచ్చింది ! AU లో M Sc ( Marine Geophysics ) చదివే రోజులలో క్లాస్ లో మొదటి స్థానం లో ఉండే వారు . ఆ టైం లో విద్యార్థులకు ఒక అరుదైన అవకాశం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓసియానోగ్రఫీ ( NIO) రూపంలో వచ్చింది . క్లాసులో 5 గురు విద్యార్థులు AU నుంచి GoA కు NIO వారి Research vessel లో Internship కోసం పంపారు. తీరా అక్కడికి వెళ్ళాక వారిలో ఒక్కరికే ఆ అవకాశం ఉందని అధికారులు చెప్పారు . మీరే నిర్ణయించండి అని అక్కడి సైంటిస్ట్ లకే వదిలేశారు. ఆ అవకాశం మునుకుట్ల రాధాకృష్ణకు ఇచ్చారు.తరువాత… M Sc క్లాస్ లో మొదటి స్థానం పొంది ధన్బాద్ లోని Indian School of Mines ( ఇప్పుడుIIT-ISM) లో Ph D చేయడానికి వెళ్లారు . అప్పటికి Marine Geophysics లో డాక్టరేట్ పొందిన, అతి తక్కువ మంది లో మునుకుట్ల రాధాకృష్ణ ఒకరు ! Dept of Ocean Development లో కొంతకాలం పనిచేసి టీచింగ్ మీద పరిశోధనల మీది మక్కువతో మొదట Cochin University of Science & Technology లో lecturer గా చేరారు. అది వారి జీవితంలో గొప్ప మలుపు. ఎందుకంటే…. అక్కడ మునుకుట్ల రాధాకృష్ణ కు ఎందరో విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం కలిగింది . దానితో బాటు వారి పరిశోధనలు వారికి ఎంతో ఖ్యాతిని సంపాదించి పెట్టాయి.2000 సం లో Indian Geophysical Union రాధాకృష్ణకు MS కృష్ణన్ గోల్డ్ మెడల్ ఇచ్చి గౌరవించింది.2004 సం లో ఖ్యాతిగాంచిన Commonwealth Academic staff మునుకుట్ల రాధాకృష్ణ ను UK లోని దుర్హాం విశ్వవిద్యాలయం తో కలిసి పరిశోధనలు చేసేందుకు ఫెలోషిప్ ను ఇచ్చారు.2007 సం లో మునుకుట్ల రాధాకృష్ణ IIT Bombay లోని Earth Sciences dept లో చేరారు అక్కడ పని చేస్తున్నప్పుడు ఒక సాయంత్రం రాధాకృష్ణ కు ASR గారి నుంచి ఫోన్ వచ్చింది నువ్వు చేర వలసిన చోటు ( IIT-Bombay ) కి చేరావు అని అభినందించారు ! ASR గారు దీవించినట్లే IIT Bombay లో మునుకుట్ల రాధా కృష్ణ పరిశోధనలు అతనికి జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని గడించాయిMonash University, Australiaతో సంయుక్తం గా Ph D program నిర్వహించే అవకాశము వచ్చిందిUK కు చెందిన Southampton University తో కలిసి పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు మునుకుట్ల రాధాకృష్ణ !2018 సం లో మునుకుట్ల రాధాకృష్ణ ఉన్నత బోధనా నైపుణ్యానికి గుర్తిం పుగా వారికిS.P. Sukhatme ప్రతిభా పురస్కారం లభించింది .2019 సం లో మునుకుట్ల రాధాకృష్ణ కు భూగర్భ వనరుల మంత్రిత్వ శాఖ ,వారిని ప్రతిభా పురస్కారం తో సన్మానించింది2021 సం లో Indian Geophysical Union వారు మునుకుట్ల రాధాకృష్ణ కు అరుదైన Decennial Award ను ఇచ్చి గౌరవించింది.మునుకుట్ల రాధాకృష్ణ గైడెన్స్ లో 25 కు పైగా విద్యార్థులు డాక్టరేట్ పట్టాలను పొందారు . వారంతా వివిధ IIT లలోను , జాతీయ అంతర్జాతీయ పరిశోధన సంస్థలలో ఉన్నత పదవులలో పని చేస్తున్నారు.ఇప్పుడు మన మునుకుట్ల రాధాకృష్ణ అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలలో గౌరవ పదవులనునిర్వహిస్తున్నారు ,Prof. Munukutla RadhaKrishna ఇప్పుడు IIT Bombay లో ఎర్త్ సైన్సెస్ విభాగాధిపతి !                                                               పూజ్యగురువులు ( లేట్) ASR గారికి జేజేలు !                                   వారి శిష్యుడు Prof. మునుకుట్ల రాధాకృష్ణ కు అభినందనలు !!

Scroll to Top