నడింపల్లి సీతారామరాజు
సేవల్లో రాజుగోరు జర్నలిజంలో సానా పెద్దోరు) మూడు దశాబ్దాల క్రితం. ఓ సాయంత్రం వేళ హైదరాబాద్లో రాంనగర్ వెళ్లే దారిలో విఎస్టీ ఫ్యాకర్టీ గోడకి ఎదురుగా ఉన్న ఉదయం దిన పత్రిక ఆఫీసులో ఓ మూల కూర్చుని వార్త రాసుకుంటున్నాను. అది ఉదయంలో సిటీ డెస్క్. డెస్క్ ఇన్చార్జి, కొందరు సబ్ ఎడిటర్లు పనిలో ఉన్నారు. నేను ఆ రోజు మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమం రిపోర్ట్ రాసుకుంటున్నారు. తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా వేసుకుని ఎర్ర శరీర రంగులో, కాసింత గిరజాల జట్టు, కొనదేరిన ముక్కు ఉన్న ఓ పెద్దాయన డెస్క్ దగ్గరికి వచ్చారు. డెస్క్ ఇన్ఛార్జితో “ఈ రోజు సిటీ టాబ్లాయిడ్ రెండో పేజీలో హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు కథనం రాసింది ఎవరు” అని అడిగారు. సిటీ డెస్క్ ఇన్చార్జి కాసింత దూరంగా ఉన్న నన్ను చూపించి “కొత్త కుర్రాడు సార్. చక్రధర్ అని. ఏమైంది సార్” కాసింత భయంగానే అడుగుతూ నన్ను రమ్మని చేతులతో సైగ చేశారు. నేను వెళ్లి వారిద్దరికి దగ్గరగా నుంచున్నా. “ఈయన చీఫ్ రిపోర్టర్. నడింపల్లి సీతారామ రాజు గారు. నిన్న వార్త ఎవరు రాసారు అని అడుగుతున్నారు” అన్నారు నాతో. నేను కాసింత భయంతోనే “తప్పు రాసానారా సార్” అని అడిగా. దానికి ఆ నడింపల్లి సీతారామ రాజు గారు “తప్పు కాదు. చాలా బాగా రాసావు. కొత్త రిపోర్టర్ రాసినట్లు లేదు. అభినందిద్దామని వచ్చా. ఏ ఊరు మీది” అన్నారు. “మాది అవలాపురం అండి” అన్నాను. “మాది అవలాపురమే. ఇలాగే రాయి. పైకి వస్తావు. ముఖ్యంగా పత్రికలు చదువు” అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారేమో… ఎందుకంటే ఈ నడింపల్లి సీతారామ రాజు గారు మంచి ఎక్కడ ఉంటే అక్కడుంటారు అని చెప్పడానికి. పత్రికల్లో పని చేసిన వారికి.. ముఖ్యంగా సీనియర్లకు కింది ఉద్యోగులంటే ఇష్టం ఉండదు. వారితో మాట్లాడడం నామోషి అనుకుంటారు. అలా “పడదు.. నామోషి” వంటి మాటలు ఈ నడింపల్లి రాజుగారికి తెలీదు. ఈయన మనుషుల్ని ప్రేమించడంలోను, సమాజానికి ఏదైనా చేయాలనే తపనలోనూ రారాజే అని చెప్పడానికి ఇదంతా.కోనసీమలోని ఓ పల్లెటూరు నుంచి అమలాపురం వచ్చి ఎస్కేబీఆర్ కాలేజీలో పీయూసి, డిగ్రీ చదివారు. కూచిమంచి అగ్రహారంలోనే మరో నలుగురు సహాధ్యాయులతో కలిసి ఓ రూంలో ఉండి చదువుకున్నారు. ఇప్పుడంటే ఇన్ని హొటళ్లు వచ్చాయి కాని ఆ రోజుల్లో వొటేళ్లు లేవు. ఇంటి నుంచి ఎవరో ఒకరు సైకిల్కి క్యారేజీలు కట్టుకుని వచ్చి చదువుకునే వారికి ఇచ్చేవారు. ఇది రెండు పూటలా జరిగే నిత్య కృతువు. విద్యార్థి దశలో ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండే వారట సీతారామ రాజు గారు. అందులోనూ ఈయనకి గురువు వారణాసి సూర్యనారాయణ గారు. అంటే ఆ మధ్య కేంద్ర బీజేపీలో ఓ చక్రం తిప్పారు చూడండి రామ్మాధవ్. వాళ్ల నాన్నగారన్నమాట. ఆయనతో కలిసి కోనసీమే కాదు చాలా ప్రాంతాలు తిరిగారు. ఆర్ఎస్ఎస్ తర్వాత అఖిల భారత విద్యార్ధి పరిషత్ నాయకుడిగా ఎదిగారు. ఎదగడం అంటే మామూలుగా కాదు. ఎబీవీపీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి . అమలాపురంలో ఏబీవీపీ జిల్లా క్యాంపు నిర్వహించింది ఈ నడింపల్లి సీతారామరాజు గారే. ఆ క్యాంపుకి వచ్చిన వాళ్లలో మాజీ ఉప రాష్ట్రపతి ముప్పరపు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. ఇంతే కాదు… బెనారస్ యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకుడు గోవాల్కర్ దగ్గర శిష్యుడిగా కొన్నాళ్లు పని చేశారు. ఈయన కమ్యూనిస్టు కదా… ఇవన్నీ ఏంటి అనుకున్నాను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు. ఆ మార్పు ఆయనే చెప్పారు. ప్రజల కోసం పని చేయాలి కాని… ఈ క్యాంపులు అవీ కాదు అనుకుంటున్న సమయంలోనే సైద్ధాంతిక విబేధాలతో అక్కడి నుంచి వచ్చేశారు. అప్పటికే నక్సల్బరీ ఉద్యమం సెగలు శ్రీకాకుళం పోరాటం వైపు వీచడం, ఆ వేడి గాలులు నడింపల్లి వారిని కూడా తాకడంతో నక్సల్స్ సానుభూతిపరుడిగా తనను తాను మార్చుకున్నారట. ఇక్కడ చిన్న స్వవిషయం. నేను కూడా అలా ఆర్ఎస్ఎస్ ప్రభావంతో కొన్నాళ్లు ఉండి ఆ తర్వాత కమ్యూనిస్టుగా మారి జర్నలిస్టుగా స్ధిరపడిన వాడినే. అంటే ఒక్కో తరంలో ఇలాంటి వాళ్లు ఆనాడు ఉండే వారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే విద్యార్ధులే కాన రారు. అదో విషాదం.ఎస్కేబీఆర్ కళాశాలలో విద్యార్ధుల ఎన్నికలు వచ్చాయి. అందరూ సీతారామ రాజు గారిని పోటీ చేయమన్నారు. కానీ, ఈయన బలవంతంపై గోకరకొండ విజయరామారావుని అధ్యక్షుడిగా నిలబెట్టి గెలిపించింది ఈ నడింపల్లి వారబ్బాయే. జై ఆంధ్రా ఉద్యమం గుర్తుందా… ఆ ఉద్యమానికి జాయింట్ కన్వీనర్ కూడా ఈ సీతారామరాజు గారే అని తెలిసి ఒకింత ఆనందపడ్డాను. మీరు సంతసిస్తారని చెబుతున్నాను అంతే. విశాఖ ఉక్కు… ఆంధ్రుల హక్కు ఉద్యమం నడిచింది కదా. అందులోనూ ఈ సీతారామరాజుగారి పాత్ర చాలా పెద్దదే. ఈ మధ్యంటే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం జరుపుతున్నారు కాని… ఆ రోజుల్లోనే హిందీ నహీహై… తెలుగు అచ్చాహై అని నినదించింది ఈయనే. కాకపోతే తెలుగులోనే నినాదాలు చేశారు. జై ఆంధ్రా ఉద్యమంలో భాగంగా గడియారస్థంభం దగ్గర వేల మంది ఆందోళన చేస్తే అది కాస్తా పోలీసు కాల్పుల వరకూ వెళ్లింది. ఒకవేళ అదే జరిగి ఉంటే పొట్టి శ్రీరాములు వంటి వారు మన అమలాపురంలోనూ ఉన్నారని గుండెలు ఉప్పొంగించి చెప్పుకుందుము. ఈ ఉద్యమంలోనే నడింపల్లి వారిని అరెస్టు చేసి రాజమండ్రి జైలులో ఖైదు చేశారట ఓ నాలుగు నెలలు. అన్నట్లు అప్పుడే ఆయనకి పాప పుట్టింది. ఆ అమ్మాయికి అరుణ అని పేరు పెట్టుకున్నారు.సరే, మన కాలేజీలో ఈ నడింపల్లి సీతారామరాజు గారికి చాలా ఇష్టమైన లెక్చరర్ పొలిటికల్ సైన్స్ చెప్పిన జి.వెంకటేశ్వర రావుగారు. ఇక ఈయనకు సూర్ఫినిచ్చింది మాత్రం ప్రిన్సిపాల్ రమేశం గారు. కాలేజీ గురించి చెప్పండి అంటే సీతారామరాజు గారు వెంటనే తడుముకోకుండా అన్న మాట “One Of the Best College”.కాలేజీ రోజుల్లోనే నడింపల్లి వారి జర్నలిజం ప్రారంభమైంది. ఎలా అంటే… స్వామి వివేకానంద గురించి రాసిన ఓ వ్యాసం ఆంధ్రప్రభకి పంపితే వాళ్లు వెంటనే ముద్రించారు. అది కూడా ఆ వ్యాసానికి పారితోషికం అక్షరాలా… 30 రూపాయలు. అందులో 15 రూపాయలు ఖర్చు చేసి ఐదు దుప్పట్లు కొని బస్టాండ్ దగ్గర దిక్కుమొక్కులేని వారికి అర్ధర్రాతి కప్పారట. ఇప్పుడు పది వేల రూపాయలు సూట్ వేసుకున్నా రాని తృప్తి ఆ రాత్రి దక్కింది అన్నారు సీతారామరాజుగారు.ఉదయం దినపత్రికతో పాటు బొబ్బిలిపులి పక్ష పత్రిక, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో పని చేసిన సీతారామరాజు గారికి పెద్ద ఎన్టీఆర్ చాలా ప్రాధాన్యం ఇచ్చే వారు. అది ఎంత అంటే….”రాజుగారు మీరు పోటీ చేయండి” అన్నంత. ఈయనకి ఇష్టం లేదు కదా… వద్దండి అని సున్నితంగా తిరస్కరించారు. ఓ విధంగా మాజీ నక్సలైట్ కదా… అందుకని “ఈ పార్లమెంటరీ ఎన్నికలపై నాకు నమ్మకం లేదండి” అని కూడా చెప్పారట. ఎన్టీఆర్, వీ.పీ.సింగ్, యాసర్ ఆరాఫత్ వంటి హేమాహేమీలను ఇంటర్వ్యూ చేసింది కూడా ఈయనే. ఎన్టీఆర్ అవార్డుతో పాటు అనేకానేక అవార్డులు ఈ నడింపల్లి వారి అడ్రస్ కనుక్కుని వచ్చి వాలాయి. సెన్సార్ బోర్డుకు ఏకంగా 15 సంవత్సరాల పాటు ఏకధాటిగా సభ్యుడిగా ఉన్నారు. అందుకేనేమో ఈయనతో మాట్లాడుతూంటే చాలా విషయాలు సెన్సార్ అయిపోయాయి. జర్నలిస్టుగా ది ఎకానమిస్టులో చిన్న వార్త రాయడమే కష్టం. అలాంటిది నడింపల్లి సీతారామరాజు గారు ఏకంగా కవర్ స్టోరీ రాసేశారు. నా ఎరుకలో ఓ తెలుగు జర్నలిస్టుకు ఇలా రాసే అవకాశం చాలా అరుదు. చాలామందికి రాలేదు. ఈయనకి వచ్చింది. దీన్ని అదృష్టం అనరు గాక అనరు. దీన్ని ఇంగ్లీషులో టాలెంట్ అని, తెలుగులో ప్రతిభ అని అంటారని నాకు తెలిసొచ్చింది. చదువులో కూడా మంచి చురుకుగా ఉండే సీతారామరాజుగారు బాస్కెట్బాల్ కూడా ఆడేవారు. నేటి ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణ గారు తన బాస్కెట్బాల్ టీంలో సీతారామరాజుగారికి తప్పకుండా అవకాశం ఇచ్చేవారు.అమలాపురం పట్టణానికి మహాకవి శ్రీశ్రీ, మహా రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి, నగ్నముని, జ్వాలాముఖి, వరవరరావు వంటి మహానుభావులు వచ్చింది నడింపల్లి సీతారామరాజు గారి వల్లే. అమలాపురంలో విప్లవ రచయితల సంఘం సమావేశం పెట్టి వీరందరినీ పట్టణానికి తీసుకొచ్చారు. ఇదే కాదు… పౌర హక్కుల సంఘం సమావేశం పెట్టి పోలీసుల చేత వార్నింగ్ లాంటి హెచ్చరికలు అందుకున్నది కూడా నడింపల్లి సీతారామరాజు గారే. బంధువుల అమ్మాయి లక్ష్మీ కస్తూరిని వివాహం చేసుకుని ముగ్గుర పిల్లలకి జన్మనిచ్చారు. వారంతా విదేశాల్లో సెటిల్ అయ్యారు. తండ్రిలాగే పిల్లలు కూడా సాయం చేసే చేతులనే నమ్మున్నారు. ప్రార్థన చేసే పెదవులు చాలామందికే ఉంటాయి కదా… ఈ లాజిక్ మిస్ కాలేదు ఈ తండ్రి నడింపల్లి సీతారామరాజు గారు. ఆయన వారసులు.